- కొంత సొత్తు రికవరీ
- ఇంటి పెద్ద అల్లుడు, అతడి కొడుకే సూత్రధారులుగా గుర్తింపు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ భగత్నగర్లో ఇటీవల జరిగిన దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురితోపాటు మరో ఐదుగురిని పోలీసులు ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో అదుపులోకి తీసుకున్నారని, దోపిడీకి గురైన కొంత సొత్తును రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రజావుద్దీన్ కోసం వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అర్ధరాత్రి భగత్ నగర్కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దొంగలు అలీతోపాటు అతడి భార్య, ఇద్దరు కూతుళ్లను ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి ఇంట్లో ఉన్న 54 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
ఈ దోపిడీని సవాల్గా తీసుకున్న సీపీ గౌష్ ఆలం.. నిందితులు మీరట్లో ఉన్నట్లు తెలుసుకొని ప్రత్యేక టీమ్లను పంపారు. గత ఐదు రోజులుగా అక్కడే మకాం వేసిన పోలీసులు ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు వ్యక్తులతోపాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగల కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ దోపిడీలో కీలకంగా వ్యవహరించిన ఇంటికి పెద్ద అల్లుడు రజావుద్దీన్ పెద్ద కొడుకును కూడా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. రజావుద్దీన్ను పట్టుకుంటే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
