భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు కెప్టెన్ డసన్ షనకను మన్కడింగ్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత అంపైర్ కు అప్పీల్ చేశాడు. ఈ సమయంలో కలుగచేసుకున్న రోహిత్ శర్మ..షమీ చేత అప్పీల్ ను వెనక్కు తీసుకునేలా చేశాడు. షమీ మన్కడింగ్ చేసే సమయంలో షనక 98 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
శ్రీలంక ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ను మహమ్మద్ షమీ వేశాడు. మొదటి మూడు బంతులను షనక ఆడగా.. నాలుగో బంతికి కసున్ రజితా స్ట్రైక్ లోకి వచ్చాడు. 98 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్న షనక నాన్ స్ట్రైకర్లో ఉన్నాడు. షమీ ఐదో బంతి వేయక ముందే షనక క్రీజు దాటాడు. దీన్ని గమనించిన షమీ.. మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని.. షమీ చేత అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత స్ట్రైక్లోకి వచ్చిన షనక బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం మన్కడింగ్ రనౌట్ పై స్పందించిన రోహిత్ శర్మ..షమీ మన్కడింగ్ చేస్తాడని ఊహించలేదన్నాడు. 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న షనకను ఇలా ఔట్ చేయడం పద్దతి కాదని భావించే అప్పీల్ను వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశాడు. షనక అసాధారణ బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు.