17 రోజుల శ్రీరామాయణ్ యాత్రను ప్రారంభించిన రైల్వే

17 రోజుల శ్రీరామాయణ్ యాత్రను ప్రారంభించిన రైల్వే
  • నేపాల్ నుంచి రామేశ్వరం వరకు శ్రీరాముని ప్రధాన దేవాలయాల దర్శన అవకాశం
  • zనవంబర్ 7న ఢిల్లీ నుంచి తొలి రైలు.. 
  • అత్యాధునిక సౌకర్యాలతో మొత్తం రైలు ఏసీ.. టికెట్ ధర రూ.82,950

శ్రీరాముని భక్తులకు నిజంగా శుభవార్తే. దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీరామునికి సంబంధించిన ప్రధాన దేవాలయాలను ఒకేసారి యాత్ర ద్వారా దర్శించుకునే అవకాశం కల్పించాలని భారత రైల్వే శాఖ (ఐఆర్ సిటిసి) నిర్ణయించింది. గతంలో ఇది వరకు నడిచిన రైలు సర్వీసే. కాకపోతే ఇప్పుడు పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో యాత్రను మరింత సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా సాగేలా ఏర్పాట్లు చేసింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC - Indian Railway Catering and Tourism Corporation).
దేఖో అప్నా దేశ్‌ అనే నినాదంతో రైలు యాత్ర
‘దేఖో అప్నా దేశ్’ అనే నినాదంతో ఐఆర్సీటీసీ ఈ రైలు యాత్ర నడుపనుంది. దాదాపు 7 రోజులపాటు సుదీర్ఘంగా సాగే ఈ రైలు యాత్రను ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగేలా ఏర్పాట్లు చేసింది. తొలి రైలు నవంబర్‌ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది. తొలి స్టాప్‌ నేరుగా అయోధ్యకే. అయోధ్యలో రామజన్మభూమి దేవాలయం సందర్శనతో యాత్ర ప్రారంభమై  నందిగ్రామ్‌లో ఉన్న భరత్‌ మందిర్‌ను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత రెండో గమ్యం బీహార్‌లోని శ్రీరాముని సతీమణి సీతమ్మ జన్మ స్థానం  (సీతామర్హి). భారతదేశం వెలుపల నేపాల్‌లో ఉన్న రామ్‌ జానకి దేవాలయానికి కూడా రోడ్డు మార్గంలో తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో వారణాసికి.. అక్కడి పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను దర్శించుకున్నాక.. మహారాష్ట్రలోని నాసిక్‌, హంపి, తమిళనాడులోని రామేశ్వరం వరకు సాగుతుంది ఈ యాత్ర.
అత్యాధునిక కిచెన్.. సెన్సార్ తో పనిచేసే వాష్ రూమ్స్
దాదాపు 7500 కిలోమీటర్లకు పైగా సాగుతుంది కాబట్టి అత్యాధునిక సౌకర్యాలు ఉన్న డీలెక్స్‌ ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ గా తీర్చిదిద్దారు. ఈ ఏసీ ట్రైన్ లో స్టార్ హోటల్ ను తలదన్నేలా చక్కటి రెస్టారెంట్లు, ఆధునాత కిచెన్‌ ఉంటుంది. అంతేకాదు అత్యాధునినిక సౌకర్యాలతో స్నానపు గదులు, సెన్సర్‌తో పనిచేసే వాష్‌రూమ్స్‌, ఫుట్‌ మసాజర్స్ కూడా ఉన్నాయి. ప్రతికోచ్ లో సీసీ టీవీ కెమెరా నిఘాతోపాటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. యాత్రను ఎంచుకునేందుకు ఫస్ట్‌ క్లాస్ ఏసీ మాత్రమే కాదు  సెకండ్‌ క్లాస్  ఏసీ అంటూ రెండు కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. చివరగా రామేశ్వరంలో దర్శనాలు ముగిశాక ఢిల్లీకి తిరిగి వస్తారు. 
టూర్ కు ట్రావెల్ భీమా
శ్రీ రామాయణ్ యాత్ర ప్యాకేజీలో భాగంగా మీరు ఏసీ క్లాసులో ప్రయాణం చేయడమే కాకుండా... ఇతర చోట్ల ఏసీ హోటల్స్‌లో సౌకర్యం కల్పిస్తారు. భోజన సౌకర్యాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని పర్యటనకు కూడా ఏసీ బస్సుల్లోనే తీసుకెళతారు. అంతేకాదు ట్రావెల్‌ బీమా కూడా కల్పిస్తున్నారు.