
లోక్ సభ ఎన్నికల వేళ ఆర్మీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని నివారించాలంటూ 156 మంది మాజీ ఉద్యోగులు శుక్రవారం రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది. లేఖరాసిన వారంతా కల్నల్, ఆ పై స్థాయి ర్యాంకుల్లో రిటైరైన వారే. అందులో ఎనిమిది మంది మాజీచీఫ్ ఆఫ్ స్టాఫ్ లు కూడా ఉండటం గమనార్హం. త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ల పేరు చెప్పుకొని ఓట్లు అడగటం ఆక్షేపణీయమని మాజీలు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ నేతలు, పార్టీల తీరుతో బలగాల ప్రతిష్ట ప్రమాదంలో పడిందని, రాజకీయేతర వ్యవస్థలుగా వాటిని పరిరక్షించాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.అయితే, మాజీ అధికారులు రాసినట్లుగా చెబుతున్న లేఖ అందలేదని రాష్ట్రపతి భవన్ ప్రకటించడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ సమ్మతి లేకుండా ప్రకటన వెలువడిందని లేఖలో సంతకాలు చేసిన ముగ్గురు మాజీలు రచ్చకెక్కడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మోడీని బ్లేమ్ చేయడానికి కాంగ్రెస్ ఫేక్ లెటర్ సృష్టించిందని రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోపించారు. కాగా, ముగ్గురు తప్ప లేఖపై సంతకాలు చేసిన మిగతా వెటరన్స్ అందరూ ప్రకటనతో సమ్మతిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంపై దృష్టి సారించాలంటూ 66 మంది మాజీ బ్యూరోక్రాట్లు మూడురోజుల కిందట రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మోడీకి చెంపపెట్టు.. కాదు ఫేక్ లెటర్
సైనికాధికారుల లేఖ ప్రధాని మోడీకి చెంపపెట్టు లాంటిదన్న కాంగ్రెస్ పార్టీ, ఓట్ల కోసం మోడీ సైనికుల్ని వాడుకోవాలనుకున్నా, సైన్యం మాత్రం దేశంవైపే నిలబడిందని పేర్కొంది. రాష్ట్రపతిభవన్ మాత్రం మాజీ సైనికాధికారుల లేఖలేవీ తమకు అందలేదని ప్రకటించింది. భవన్ ప్రకటనను ఉటంకిస్తూ, ‘ఇది కాంగ్రెస్ సృష్టించిన ఫేక్లెటర్ ’అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ఆరోపించారు.
మా పర్మిషన్ తీసుకోలేదు
లేఖలో పేర్లున్న 156 మంది సైనికాధికారుల్లోముగ్గురు తప్ప మిగతావాళ్లంతా అందులోని అంశాలతో సమ్మతిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఒకసైనికుడిగా నాకు దేశమే ముఖ్యం. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటాను. లేఖలో నా పేరుఎలా వచ్చిందో అర్థం కావట్లేదు” అని ఆర్మీ మాజీచీఫ్ జనరల్ ఎస్ఎఫ్ రొడ్రిగోస్ అన్నారు. మాజీఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ సీ సూరి స్పందిస్తూ,‘‘నాకు తెల్సినంతవరకు నేవీ మాజీ చీఫ్ రాందాస్ ఈ లేఖ రాయలేదు. బహుశా మేజర్ చౌదరి అయిఉంటారు. లెటర్ ని వాట్సాప్ , జీమెయిల్లో మాకందరికీ పంపారు. కానీ అందులోని అంశాలతో నేను విభేదిస్తున్నా”అని చెప్పారు.