వడోదరా: ఓపెనర్లు ప్రియ పునియా(124 బంతుల్లో 8 ఫోర్లతో 75 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (65 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో సౌతాఫ్రికా మహిళల జట్టుతో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 45.1 ఓవర్లలో 164 రన్స్కి ఆలౌటైంది. మరిజన్నే కాప్(54) హాఫ్ సెంచరీ చేయగా ఇండియా వెటరన్ జులన్ గోస్వామి(3/33) మూడు వికెట్లు తీసి సత్తా చాటింది. శిఖాపాండే(2/38), ఏక్తా బిస్త్(2/28), పూనమ్ యాదవ్(2/33) రెండేసి వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో 41.4 ఓవర్లు ఆడిన ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసి గెలిచింది. కాలి వేలు విరగడంతో రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంథాన ఈ మ్యాచ్కు దూరమవగా ప్రియ పునియా వన్డే జట్టుకు తొలిసారి ఎంపికైంది. అరంగేట్ర వన్డేలోనే అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. జెమీమా, పూనమ్ రౌత్(16) ఔటైనా కెప్టెన్ మిథాలీరాజ్(11 నాటౌట్)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేసిన ప్రియ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైంది.


