పెట్రోల్ కష్టాలు తెలంగాణ, ఏపీలో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక పక్క స్టాక్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తొంటే... స్టాక్ ఉన్న బంకుల్లో కిలోమీటర్ల మేర క్యూలతో అల్లాడిపోతున్నారు జనం. గత రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి.ఇది ఇలా ఉంటే... వికారాబాద్ జిల్లా పరిగిలో పరిస్థితి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కిలోమీటర్ల మేర క్యూలు ఉన్న బంకుల దగ్గర సామాన్యుడు విలవిలలాడుతుంటే... పెట్రోల్ బంకుల సిబ్బంది పుండు మీద కారం చల్లినట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పెట్రోల్ బంకుల్లో నో ఫోన్ పే, నో గూగుల్ పే అంటూ సిబ్బంది కొత్త హుకుం జారీ చేశారు.
పరిగిలో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడగా... తెరిచి ఉన్న ఒకటి రెండు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. డిజిటల్ ఇండియా అంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇక్కడ మాత్రం నో ఫోన్ పే, నో గూగుల్ పే అంటూ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. క్యాష్ ఉంటేనే పెట్రోల్ పోస్తామని... అది కూడా మినిమమ్ రూ. 100 కు పోయించుకోవాలంటూ వింత రూల్స్ పెడుతున్నారు.
ఈ క్రమంలో క్యాష్ లేక, ఆన్లైన్ పేమెంట్స్ పనిచేయక వాహనదారులు బంకుల దగ్గరే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొరత సమయంలో ఇదేం అన్యాయం అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ తగినంత స్టాక్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు వాహనదారులు.

