ప్రపంచ దేశాలు నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఇంధన అవసరాలు, కాలుష్య నియంత్రణ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మార్పులో భారత్ వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలిచింది. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2014లో కేవలం 2.82 గిగావాట్లుగా ఉన్న దేశ సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం, 2026 జూన్ 30 నాటికి 162.15 గిగావాట్లకు చేరి సుమారు 57 రెట్లు పెరిగింది.
ఈ పురోగతి భారత ఇంధన రంగ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచింది. ప్రపంచ సౌరశక్తి రంగంలో చైనా సుమారు 1,460 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో తొలి స్థానంలో, అమెరికా సుమారు 210 గిగావాట్లతో రెండో స్థానంలో ఉండగా, 162.15 గిగావాట్ల సామర్థ్యంతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గత దశాబ్దంలో అత్యంత వేగంగా ఎదిగిన ప్రధాన సౌరశక్తి దేశాలలో భారత్ ఒకటిగా గుర్తింపు పొందింది.
విస్తృత ఉపాధి అవకాశాలు
ఈ విజయానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ సౌర మిషన్, భారీ సౌర పార్కుల ఏర్పాటు, గృహాలపై రూఫ్టాప్ సౌర వ్యవస్థలకు ప్రోత్సాహం, రైతుల కోసం ప్రత్యేక పథకాలు, సౌర పరికరాల దేశీయ తయారీకి ప్రాధాన్యం వంటి అనేక విధానాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీంతో భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ సామర్థ్యం కలిగిన దేశంగా ఎదిగింది.
సౌరశక్తి విస్తరణతో దేశానికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతోంది. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ లభించడం వల్ల ఉత్పత్తి పెరుగుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, పీఎం-కుసుమ్ వంటి పథకాల ద్వారా గృహాలు, రైతులు సౌర విద్యుత్ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్ వ్యవస్థలు విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా, అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. రైతులు సౌర పంపుసెట్ల ద్వారా సాగునీటి ఖర్చులను తగ్గించుకుంటున్నారు.
2030 నాటికి 500 గిగావాట్లు
సౌర ప్యానెళ్లు, సోలార్ సెల్స్, ఇన్వర్టర్లు వంటి పరికరాల తయారీలో కూడా భారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేశీయ తయారీ పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా బలాన్ని చేకూరుస్తోంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజ ఇంధన రహిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నమోదవుతున్న వేగవంతమైన పురోగతి ఆ లక్ష్యం సాధ్యమేననే విశ్వాసాన్ని కలిగిస్తోంది. సౌరశక్తి విస్తరణతోపాటు విద్యుత్ నిల్వ వ్యవస్థలు (బ్యాటరీ స్టోరేజ్), గ్రీన్ హైడ్రోజన్, ఆధునిక ప్రసార వ్యవస్థల అభివృద్ధి కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
సౌరశక్తి రంగంలో ఈ 57 రెట్ల వృద్ధి కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. ఇది భారతదేశం ఇంధన రంగంలో సాధించిన దూరదృష్టి, సమర్థవంతమైన విధానాలు, సాంకేతిక పురోగతి, ప్రజల భాగస్వామ్యానికి ప్రతీక. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి అనే మూడు ప్రధాన లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో ప్రతి ఇంటిపై సౌర ప్యానెల్, ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన విద్యుత్, ప్రతి రైతుకు సౌర శక్తి అందుబాటులోకి రావడం ద్వారా హరిత భారత్ – శక్తిమంతమైన భారత్ అనే సంకల్పం మరింత బలపడుతుంది. సౌరశక్తి విప్లవం భారతదేశాన్ని ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో అగ్రగామిగా నిలబెట్టే మహత్తర శక్తిగా కొనసాగనుంది.
- దురిశెట్టి మనోహర్
విశ్రాంత ఏడీఈ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
