- నాలుగో టెస్టులో ఇండియా విక్టరీ
- సిరీస్లో 2‑1తో ఆధిక్యం
ఇంగ్లండ్ టూర్లో ఇండియా అదరగొట్టింది. ఆఖరి రోజు బౌలింగ్లో ఇరగదీసిన కోహ్లీసేన నాలుగో టెస్టులో ఘన విజయం సొంతం చేసుకుంది. ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్తో పాటు స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేయడంతో 157 రన్స్ తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. ఇండియా బౌలింగ్ ధాటికి 368 రన్స్ ఛేజింగ్లో హోమ్టీమ్ 210 రన్స్కే ఆలౌటైంది. ది ఓవల్ గ్రౌండ్లో యాభై ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత
తొలి విజయం అందుకున్న ఇండియా.. ఐదు టెస్టుల సిరీస్లో 2‑1తో ఆధిక్యం సాధించింది.
50 ఏళ్లుగా మనకు విజయం లేని గ్రౌండ్..! కండిషన్స్ పరంగా ఇంగ్లండ్కు సూపర్ అడ్వాంటేజ్..! ఈ రెండింటికి తోడుగా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హోమ్ టీమ్కు ఆధిక్యం..! ఇలా మూడు మైనస్ల మధ్య ఆట మొదలుపెట్టిన టీమిండియా.. నాలుగో టెస్టులో అద్భుతం చేసింది..! సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్ సూపర్ సెంచరీ, శార్దూల్ ఆల్రౌండ్ షోతో.. బలమైన ఇంగ్లండ్కు చెక్ పెట్టింది..! భారీ టార్గెట్ను నిర్దేశించడంతో పాటు.. అద్భుత బౌలింగ్తో రూట్సేన వికెట్లను విరిచేసి గ్రాండ్ విక్టరీని కొట్టింది..! దీంతో అచ్చిరాని గ్రౌండ్లోనే అసాధారణ విజయంతో సిరీస్లో 2–1 లీడ్లో నిలిచింది..!!
లండన్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మళ్లీ జూలు విదిల్చింది. గత నాలుగు రోజులుగా సెషన్.. సెషన్కు ఆధిపత్యం చేతులు మారినా.. ఆఖరి రోజు బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్తో గ్రాండ్ విక్టరీ ఖాతాలో వేసుకుంది. దీంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్లో ఇండియా 157 రన్స్ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1 ఆధిక్యంలో నిలిచింది. కోహ్లీసేన నిర్దేశించిన 368 రన్స్ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 92.2 ఓవర్లలో 210 రన్స్కు ఆలౌటైంది. హసీబ్ హమీద్ (63) టాప్ స్కోరర్. బర్న్స్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇండియా బౌలర్లలో ఉమేశ్ 3 వికెట్లు తీశాడు. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 50 ఏళ్ల తర్వాత ఓవల్లో మనకు ఇది ఫస్ట్ విక్టరీ. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్ట్ మాంచెస్టర్లో శుక్రవారం మొదలవుతుంది.
ఓపెనర్లు మాత్రమే..
77/0 ఓవర్నైట్ స్కోరుతో లాస్ట్ డే ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హమీద్ అల్ట్రా డిఫెన్సివ్ అప్రోచ్తో ముందుకెళ్లినా.. రెండో ఎండ్లో బర్న్స్, మలన్ (5) వరుస విరామాల్లో ఔటయ్యారు. పేసర్లతో పాటు జడేజా (2/50) కాస్త టర్నింగ్ రాబట్టడంతో హోమ్ టీమ్కు రన్స్ చేయడం ఇబ్బందిగా మారింది. స్టార్టింగ్లోనే హమీద్ ఇచ్చిన క్యాచ్ మిడాన్లో జడేజా వదిలేయడంతో సిరాజ్కు వికెట్ మిస్సయ్యింది. కానీ 41వ ఓవర్లో శార్దూల్ (2/22) తొలి దెబ్బ కొట్టాడు. ఓ ఫుల్ లెంగ్త్ బాల్తో బర్న్స్ను ఔట్ చేయడంతో ఫస్ట్ వికెట్కు 100 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. వన్డౌన్లో వచ్చిన మలన్ సాలిడ్ డిఫెన్స్తో కనిపించినా.. సింగిల్ విషయంలో హమీద్ మిస్ జడ్జిమెంట్కు రనౌటయ్యాడు. జడేజా బాల్ను షార్ట్ కవర్స్లోకి నెట్టి లేని రన్ కోసం పరుగెత్తగా, మయాంక్ త్రోకు వెనుదిరిగాడు. హమీద్తో కలిసిన రూట్(36) నిలకడగా ఆడటంతో 59 ఓవర్లలో ఇంగ్లండ్ 131/2తో లంచ్కు వెళ్లింది.
6 రన్స్ తేడాలో 4 వికెట్లు
లంచ్ తర్వాత జడేజా, బుమ్రా (2/27) హవా నడిచింది. ముఖ్యంగా జడ్డూ క్లాసిక్ లెఫ్టార్మ్ బౌలింగ్తో అశ్విన్ లేని లోటును భర్తీ చేశాడు. 62వ ఓవర్లో రైట్హ్యాండ్ హమీద్ను కంప్లీట్ ఔట్సైడ్ లెగ్ స్టంప్ బాల్తో ఔట్ చేయడం మ్యాచ్కే హైలెట్. కొద్దిసేపటికే బుమ్రా డబుల్ ఝలక్ ఇచ్చాడు. ఇన్కమింగ్ రివర్స్ స్వింగ్ డెలివరీతో.. 65వ ఓవర్లో పోప్ (2)ను వెనక్కి పంపాడు. తన తర్వాతి ఓవర్లో క్లాసిక్ యార్కర్తో బెయిర్స్టో (0)ను పెవిలియన్కు చేర్చాడు. ఇదే ఓవర్లో బుమ్రా సంధించిన సూపర్ యార్కర్కు రూట్ కళ్లు బైర్లు కమ్మాయి. కానీ ఎలాగోలా వికెట్ కాపాడుకున్నాడు. తర్వాతి ఓవర్లో జడేజా మళ్లీ మ్యాజిక్ చేశాడు. కొత్తగా క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (0)కి షాకిచ్చాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆఫ్ స్టంప్ మీదకు బాల్ వేసి వికెట్ తీశాడు. ఎక్స్ట్రా బౌన్స్తో షోల్డర్ హైట్లో వచ్చిన బాల్ను అలీ.. టచ్ చేయడంతో షార్ట్ లెగ్లో సూర్య క్యాచ్ అందుకున్నాడు. ఓ దశలో141/2 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన ఇంగ్లండ్ 147/6తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓవరాల్గా 6.1ఓవర్ల వ్యవధిలో 6 రన్స్ తేడాలో ఈ నాలుగు వికెట్లు పడటంతో ఇండియా కంప్లీట్గా గెలుపు రేస్లోకి వచ్చేసింది. రెండు ఓవర్ల తర్వాత సెకండ్ స్పెల్కు వచ్చిన శార్దూల్.. నిలకడగా ఆడుతున్న రూట్ను, కొద్దిసేపటికే ఉమేశ్.. వోక్స్ (18)ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 193/8తో టీ బ్రేక్కు వెళ్లింది. లాస్ట్ సెషన్లో ఇంగ్లండ్కు 175 రన్స్ అవసరం కాగా, ఇండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. కనీసం డ్రా చేసుకోవాలనుకున్న 37.5 ఓవర్లు ఆడాల్సి రావడంతో ఓవర్టన్ (10), రాబిన్సన్ (10 నాటౌట్) ఒత్తిడిలో పడిపోయారు. దీన్ని గ్రహించిన విరాట్ బుమ్రా, ఉమేశ్ను బౌలింగ్కు దించి సక్సెస్ అయ్యాడు. కేవలం 8.1 ఓవర్లలోనే లాస్ట్ రెండు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
కపిల్ను దాటిన బుమ్రా
ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన ఇండియా తొలి పేసర్గా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. కపిల్ దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లమార్కు (1980లో) దాటగా.. బుమ్రా తన 24వ మ్యాచ్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు. ఓవరాల్గా ఇండియా తరఫున టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్లో బుమ్రా 22వ ప్లేస్లో ఉన్నాడు. స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే (619) టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 191. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 290. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 466. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్: 210 (హమీద్ 61, బర్న్స్ 50, రూట్ 36, ఉమేశ్ 3/60, బుమ్రా 2/27, జడేజా 2/50, శార్దూల్ 2/22).