IND vs ENG 2025: జురెల్‌కు లక్కీ ఛాన్స్.. నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs ENG 2025: జురెల్‌కు లక్కీ ఛాన్స్.. నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ లో బుధవారం (జూలై 23) జరగబోయే నాలుగో టెస్ట్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే మన జట్టు ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టు ప్లేయింగ్ 11 విషయంలో గందరగోళంగా ఉంది. తుది జట్టు కూర్పుపై స్పష్టత రావడం లేదు. యంగ్ ఆల్‌‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్‌‌ కుమార్ రెడ్డి,పేసర్ అర్ష్‌‌దీప్ సింగ్ నాలుగో టెస్టుకు దూరం కావడం.. ఆకాష్ దీప్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. మాంచెస్టర్ టెస్టుకు భారత జట్టు ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం. 

జురెల్‌కు లక్కీ ఛాన్స్:

బ్యాటింగ్ లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. నితీష్ రెడ్డి స్థానంలో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమైంది. పంత్ నాలుగో టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ గానే బరిలోకి దిగనున్నట్టు సమాచారం. అదే జరిగితే జురెల్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ దక్కనుంది. ప్రస్తుతం భారత జట్టులో రాహుల్ కు వికెట్ కీపింగ్ చేసే సామర్ధ్యమున్నా అతడు ఓపెనర్ కావడంతో కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం లేదు. దీంతో జట్టులో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా జురెల్ కు ఛాన్స్ లభించనుంది. 

కొత్త కుర్రాడికి అవకాశం ఇస్తారా..? 

బౌలింగ్ లో గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో కొత్త కుర్రాడు అన్షుల్‌‌ కంబోజ్ వచ్చే అవకాశం ఉంది. పేస్ లీడర్‌‌‌‌ జస్‌‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నాడని సిరాజ్ తెలపగా.. ఈ ఇద్దరితో కలిసి మూడో పేసర్‌‌‌‌గా అన్షుల్‌‌ను ఆడించే ఆప్షన్‌‌ను మేనేజ్‌‌మెంట్‌‌ పరిశీలిస్తోంది. అతనికి ప్రసిధ్ కృష్ణ నుంచి పోటీ ఉంది. రెండో టెస్టులో భారీగా రన్స్ ఇచ్చుకోవడంతో ప్రసిధ్‌‌ను లార్డ్స్‌‌లో ఆడించలేదు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌‌ గ్రౌండ్‌‌లో బుమ్రా, సిరాజ్, ప్రసిధ్‌‌, శార్దూల్‌‌తో కలిసి అన్షుల్‌‌ ముమ్మరంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. 

సుందర్ స్థానంలో కుల్దీప్: 

ఈ మ్యాచ్ లో బుమ్రా, సిరాజ్ తో పాటుగా అన్షుల్‌‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుందర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, సుందర్ స్థానాల్లో జురెల్, కంబోజ్, కుల్దీప్ జట్టులోకి రావొచ్చు.