
త్వరలో గ్రామసభలు.. అందులోనే లబ్ధిదారుల సెలెక్షన్
నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల మంజూరు
తొలిదశలో ఇంటిజాగా ఉన్నవారికే ఆర్థిక సాయం
స్కీమ్పై అధ్యయనానికి మూడు రాష్ట్రాలకు ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన అర్హులను ఎంపిక చేసి, వారికే ఇండ్లు శాంక్షన్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నది. ఇందులో భాగంగా త్వరలో గ్రామ సభలు నిర్వహించి, అందులోనే లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.
ఇప్పటికే ఇండ్లకోసం రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మంది అప్లై చేసుకోగా, త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలను సంప్రదించి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వనున్నారు. తొలిదశలో సొంత జాగా ఉన్న వారికి ఇండ్లు ఇవ్వనున్నారు. రెండో దశలో జాగా లేని వారికి స్థలం, ఇంటికోసం ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ స్కీమ్ అమలు బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా కార్పొరేషన్కు ప్రభుత్వం అప్పగించింది.
తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లచొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ అమలుకు హడ్కో నుంచి తొలి దశలో లోన్ కూడా శాంక్షన్ అయింది. రూ.3 వేల కోట్ల లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.3 వేల కోట్లతో అర్బన్, రూరల్ లో కలిపి 95,235 ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్లపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది . ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ స్కీమ్పై రివ్యూ చేపట్టారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఈ చైతన్యకుమార్, వెంకటదాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల టీమ్ ఏపీ, ఉత్తర ప్రదేశ్ లలో పర్యటించి, అక్కడి హౌసింగ్ స్కీమ్ లపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందచేసింది.
ఈ నెల 8,9,10వ తేదీల్లో అధికారుల బృందాలు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో మూడు రోజులు పర్యటించాయి ఈ మూడు రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్ లపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ కు అధికారులు రిపోర్ట్ ను అందజేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో పెద్దపీట
వచ్చే ఐదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4, 16,500 ఇండ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయించామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇందుకు అవసరమైన రూ.22,500 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టిని కోరారు. గడిచిన పదేండ్లలో సొంత ఇంటి కల సాకారం అనేది పేదవారికి అందని ద్రాక్షలా మారిందని పొంగులేటి గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అన్నారు.
కేంద్రం నుంచి నిధులు
రాష్ట్రంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. గత పదేండ్లు పీఎం ఆవాస్ యోజన, డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ గైడ్ లైన్స్ వేర్వేరుగా ఉండడంతో కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఇపుడు ఆ రూల్స్ ను రాష్ట్రప్రభుత్వం మార్చేసింది. దీంతో కేంద్ర నిధుల మంజూరుకు మార్గం సుగమమైంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై ) తొలి దశలో తెలంగాణకు తక్కువ ఇండ్లు మంజూరయ్యాయని ప్రధాని మోదీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2024-–25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రధానిని ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ కోరారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఘన చరిత్ర
ఇందిరమ్మ ఇండ్లకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ద్వారా కోట్ల మంది ఇండ్లను నిర్మించుకున్నారు. ఇప్పటికీ ఆ ఇండ్లు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇండ్లు నిర్మించుకునేలా ఈ స్కీమ్ తోడ్పడింది. ఊరి బయట ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టి వాటికి ఇందిరమ్మ కాలనీ అని పేరు పెట్టారు.
జాగాల గుర్తింపులో టెక్నాలజీ
సొంత జాగా ఉన్న లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వాడుతోంది. గ్రామాల్లో జాగా ముందు వారిని నిలబెట్టి ఫొటోలు దింపే బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం వాటి వివరాలను ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
తొలి దశలో ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేయాలని, దీని వల్ల వ్యతిరేకతను నివారించవచ్చని భావిస్తున్నది. లబ్ధిదారులకు 3 దశల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నది. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి బేస్ మెంట్ పూర్తి చేశాక, స్లాబ్ అయ్యాక, ఇంటి నిర్మాణం పూర్తి అయ్యాక ఇలా 3 దశల్లో సాయం ఇవ్వనున్నది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్లో ఎన్నో లోపాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో స్టార్ట్ చేసిన డబుల్ బెడ్ రూమ్ లో స్కీమ్ లో ఎన్నో లోపాలు బయటపడ్డాయి. గ్రేటర్లో లక్ష, ఇతర జిల్లాల్లో లక్షా 92 వేలు మొత్తంగా 2 లక్షల 92 వేల ఇండ్లు నిర్మించాలని గత సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకూ మొత్తంగా 2 లక్షల 30 వేల ఇండ్లు నిర్మించగా.. ఇందుకు రూ.9,700 కోట్లు ఖర్చు చేశారు. 63 వేల ఇండ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో వీటిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సుమారు మరో 80 వేల ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అయితే, మొత్తం ఇండ్ల నిర్మాణంలో క్వాలిటీ లేదు. పూర్తి చేసిన ఇండ్లు 3, 4 ఏండ్లు పంపిణీ చేయకుండా ఉంచడంతో వాటి తలుపులు, కిటీకీలు దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లలు చెల్లించలేదు. ఇండ్లను అర్హులకు కాకుండా పార్టీ కార్యకర్తలకు, సొంత ఇండ్లు ఉన్న వారికి ఇచ్చారనే ఆరోపణలు రాష్ట్రమంతా ఉన్నాయి.