హోంగార్డు కుటుంబానికి  .. రూ. 10 లక్షల ఆర్థికసాయం

హోంగార్డు కుటుంబానికి  .. రూ. 10 లక్షల ఆర్థికసాయం

ఉప్పల్, వెలుగు: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి మల్కాజిగిరి ఏసీపీ ఆఫీసులో 11 ఏండ్లుగా విధులు నిర్వహిస్తూ హోంగార్డు రాము ఆకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్​తో ఇటీవల మరణించారు.  దీంతో ఆయన  కుటుంబానికి  వివిధ ఠాణాలకు చెందిన ఇన్​స్పెక్టర్లు ఆర్థికంగా సాయం అందించారు. మల్కాజిగిరి  పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తమ జీతాల నుంచి రూ..10 లక్షలను జమ చేసి సదరు హోంగార్డు కుటుంబానికి అందించారు. ఆదివారం  రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ బాధిత హోంగార్డు కుటుంబానికి రూ.10లక్షల చెక్కును ఇచ్చారు.

ఈ సందర్బంగా సీపీ చౌహాన్​ మాట్లాడుతూ.. హోంగార్డు రాము  ముగ్గురు కూతుళ్ల చదువులకు  తోడ్పాటును అందిస్తామన్నారు.  రాచకొండ పరిధిలో అన్నిస్థాయిల పోలీసు అధికారుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. మానవతా దృక్పథంతో  హోంగార్డు కుటుంబానికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చిన సహ ఉద్యోగులను కమిషనర్ అభినందించారు. మల్కాజిగిరి డీసీపీ  గిరిధర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ నరేష్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు ఉన్నారు.