- సిప్ రూట్ బెటర్ అంటున్న ఎనలిస్టులు
- డెట్ ఫండ్స్ వైపు కూడా చూడొచ్చని సలహా
- కొత్త ఇన్వెస్టర్లకు ఇండెక్స్ ఫండ్స్తో మేలు
బిజినెస్ డెస్క్, వెలుగు:లాభం రావాలంటే తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మాలి. ఇది కామన్ రూల్. షేర్లకైనా, మ్యూచువల్ ఫండ్స్కైనా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం బెంచ్మార్క్ ఇండెక్స్లు ప్రతి రోజూ కొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు భారీ రిటర్న్స్ సంపాదించారు.
అదే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ప్రస్తుత మార్కెట్లో డబ్బులు పెట్టొచ్చా? మ్యూచువల్ ఫండ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చా? ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలా? లేదా మార్కెట్ పడేంత వరకు వేచి చూడాలా? అనే సందేహాలు ఉంటాయి. అలానే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? లేకపోతే డెట్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ వైపు చూడాలా? ఒకేసారి మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసేయాలా? లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) బాట పట్టాలా? అనే డౌట్స్ కూడా వస్తాయి.
ఈ ప్రశ్నలకు ఎనలిస్టులు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. మార్కెట్లు పెరుగుతున్న, వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్న ప్రస్తుత టైమ్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను ఎలా చేయాలో వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు లాంగ్ టెర్మ్ కోసం పెట్టుబడులు పెట్టాలని, ఈక్విటీతో పాటు డెట్ ఫండ్స్లో డబ్బులు పెట్టేవారు కూడా ఈ అంశాన్ని పరిగణించాలని బ్యాంక్బజార్ డాట్ కామ్ సీఈఓ అదిల్ శెట్టి పేర్కొన్నారు. సిప్ విధానాన్ని ఫాలో అవ్వాలని సలహా ఇచ్చారు.
‘ప్రతి నెలా సిప్ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్స్ను చేరుకోవడానికి వీలుంటుంది. ఇన్వెస్ట్మెంట్ను ఎప్పుడు చేశామనేదానితో సంబంధం లేదు. వడ్డీ రేట్లు వచ్చే ఏడాది తగ్గే అవకాశం ఉంది. కచ్చితంగా ఎప్పుడు తగ్గుతాయనేది మాత్రం చెప్పలేం. లాంగ్ టెర్మ్ మెచ్యూరిటీ ఉండే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించొచ్చు’ అని వివరించారు. వడ్డీ రేట్లు తగ్గుముఖం పడితే ఈక్విటీ ఫండ్స్తో కూడా మంచి రిటర్న్స్ వస్తాయని అన్నారు.
కొత్త ఇన్వెస్టర్లయితే ఇండెక్స్ ఫండ్స్తో తమ జర్నీని మొదలు పెట్టాలన్నారు. ఇండెక్స్ ఫండ్స్ నిలకడగా ఉంటాయని పేర్కొన్నారు. ఉదాహరణకు నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్లో డబ్బులు పెట్టొచ్చని చెప్పారు. ఒకే ఫండ్ ద్వారా దేశంలోని 50 అతిపెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుందని, ఖర్చు కూడా తక్కువే అని చెప్పారు. కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ను కూడా ట్రై చేయొచ్చని చెప్పారు.
ఇటువంటి ఫండ్స్ వృద్ధి చెందగలిగే చిన్న కంపెనీలను ఎంచుకుంటాయని, మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని, మార్కెట్ పడితే ఒకేసారి ఇన్వెస్ట్ చేసే విధానాన్ని కూడా పరిగణించొచ్చని అన్నారు.
పోర్టుఫోలియోలో వివిధ ఫండ్స్..
ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కంటే సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కుప్పా పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి సిప్ బెటర్ అని అన్నారు. సంపద పెంచుకోవడంలో క్రమశిక్షణ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, సమస్యలు లేకపోలేదని, కానీ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని అన్నారు.
‘దేశ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. తాజా ఫెస్టివల్ డిమాండ్ చూసినా, సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేటు చూసినా ఈ విషయం అర్థమవుతుంది. గ్లోబల్ ఎకానమీ మందగించడం, షేర్ల వాల్యుయేషన్ ఎక్కువవ్వడం, ఎలక్షన్స్ ఉండడం వంటి కొన్ని అంశాలు ఈక్విటీ మార్కెట్ను ప్రభావితం చేయొచ్చు’ అని విజయ్ అన్నారు. రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలన్నారు.
‘కొత్త ఇన్వెస్టర్లు వివిధ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తమ పోర్టుఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. తమ ఇన్వెస్ట్మెంట్లో 40–60 శాతం అమౌంట్ను లార్జ్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేనైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. డెట్, ఈక్విటీ మార్కెట్లను టచ్ చేసే హైబ్రిడ్ ఫండ్స్లో మరో 15–20 శాతం ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన అమౌంట్ను మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలి’ అని విజయ్ వివరించారు. దేశంలో వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నాయని, ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్పై కూడా ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. లేదా డైరెక్ట్గా కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు.