హైదరాబాద్​లో కొత్తగా డ్రోన్ పోర్ట్

హైదరాబాద్​లో కొత్తగా డ్రోన్ పోర్ట్
  • హైదరాబాద్​లో కొత్తగా డ్రోన్ పోర్ట్ .. డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ
  • ఎన్​ఆర్​ఎస్సీతో రాష్ట్ర ఏవియేషన్​ అకాడమీ ఒప్పందం
  • ఎన్ఆర్​ఎస్సీతో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం
  • సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ
  • ఫార్మాసిటీ పక్కన 20 ఎకరాల స్థలం కేటాయింపు కోసం సీఎంకు వినతి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​కు కొత్తగా డ్రోన్​ పోర్ట్​ రానుంది. ఈ మేరకు డ్రోన్​ పైలెట్లకు అధునాతన శిక్షణకు సంబంధించి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి ఒప్పందం కుదిరింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఎంఓయూలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ మురళీ కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

20 ఎకరాల స్థలంలో

హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలెట్ల శిక్షణకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం, ఏమేం నిర్మాణాలు చేపడుతారని ఆరా తీశారు. పైలెట్ల శిక్షణతో పాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపున అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్​లో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. 

భిన్న అంశాలపై ట్రైనింగ్

ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలెటింగ్, డ్రోన్ డేటా మేనేజ్​మెంట్, డేటా అనాలసిస్​పై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎన్ఆర్ఎస్సీ సైంటిస్టులకు, అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలెట్లకు డేటా అనాలసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్​పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని, పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వాడుతున్నారని, కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని అధికారులు వివరించారు. ఉన్నత స్థాయి నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు.

దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించినందుకు సీఎంను అభినందించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ  డ్రోన్ టెక్నాలజీని మరింత సాంకేతికంగా వినియోగించుకునేందుకు ఈ శిక్షణలో భాగస్వామ్యం పంచుకుంటుందని అన్నారు. దేశంలో12 సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టులోనే డ్రోన్ పైలెట్లకు శిక్షణనిస్తున్నామని, అక్కడున్న రద్దీ దృష్ట్యా వరంగల్ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాడైన పాత రన్-వేలను కొత్తగా నిర్మించటంతో పాటు అక్కడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనూ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్ పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

నెదర్లాండ్స్ రాయబారితో సీఎం భేటీ

భారత్​లోని నెదర్లాండ్స్ రాయబారి మెరిసా గెరార్డ్స్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలు, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్య అంశాలు ఈ భేటీలొ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.