
కూకట్ పల్లి, వెలుగు: ఐటీ ఎంప్లాయ్ మిస్సింగ్ ఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో జరిగింది. ఆకునూర్ శ్రీధర్(44), శిరీష దంపతులు కేపీహెచ్ బీ పరిధి వసంత్ నగర్ లో ఉంటున్నారు. శ్రీధర్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్నాడు.ఈ నెల 10న తెల్లవారుజామున 5.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికెళ్లిన శ్రీధర్ తిరిగిరాలేదు. శిరీష అతడికి కాల్ చేయగా.. మొబైల్ స్విచాఫ్ వచ్చింది. శ్రీధర్ ఫ్రెండ్స్ వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు.
దీంతో ఆమె కేపీహెచ్ బీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. శ్రీధర్ ఇంట్లో నుంచి బయటికెళ్లే ముందు రోజు భార్యతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పలు ఆన్ లైన్ యాప్స్ నుంచి శ్రీధర్ లోన్లు తీసుకున్నాడన్నట్లు సమాచారం. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీధర్ వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీలతా రెడ్డి తెలిపారు.