అమరావతి: మంత్రి నారా లోకేష్పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. లోకేష్కు టీవీలో మ్యాచ్ కనబడదా.. శ్రీలంక వెళ్లి చూడాలా అని ప్రశ్నించారు. గురువారం (ఫిబ్రవరి 19) తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లలో లోకేష్ పూటకో దేశం, రాష్ట్రంలో తిరుగుతున్నాడని విమర్శించారు.
పక్కనున్న తెలంగాణకు కూడా ప్రత్యేక విమానంలోనే వెళ్తున్నాడన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు ఇలా జల్సాలు చేస్తారా అని చురకలంటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎవరికీవాళ్లే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారని ఆరోపించారు.
మొత్తం గాల్లోనే తిరుగుతున్నారని అన్నారు. ఇలా ప్రజలు డబ్బులు దుర్వినియోగం చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందా అని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోందని.. ఆ ఆదాయం చంద్రబాబు, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, మద్యం సహా వనరులన్నీ దోచేస్తు్న్నారని అన్నారు.
