బీజేపీపై బెంగాల్ సీఎం మమత ఫైర్
కలకత్తా: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీజేపీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మమత ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ ఆమెను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీ మతాన్ని, రాజకీయాన్ని కలిపి గొడవలు సృష్టించాలని చూస్తోందని ఆదివారం ఫేస్బు క్ లో పోస్ట్ పెట్టారు. మతపరమైన వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలు చేయడంలో తప్పులేదని, బీజేపీ తన పార్టీ నినాదంగా దాన్ని ఉపయోగించుకుంటుందని విమర్శించారు. “ఇతరులపై రాజకీయ నినాదాలు చేయడాన్ని మేం సహించం. విధ్వంసం,హింస ద్వారా ద్వేష భావజాలాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నాలను అందరం కలసి కట్టుగా వ్యతిరేకించాలి”అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. నైహటి వెళ్తున్న మమత కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు జైశ్రీరామ్ అంటూ నినా దాలు చేశారు. దీంతో కోపానికి గురైన దీదీ వారిలో పదిమందిని అరెస్టు చేయించటంతో గొడవ మొదలైంది.