జమ్మికుంట మార్కెట్ లో గన్నీ సంచులు మాయం...సగానికి పైగా దళారులకు తరలింపు

జమ్మికుంట మార్కెట్ లో గన్నీ సంచులు మాయం...సగానికి పైగా దళారులకు తరలింపు
  •     రిజిస్టర్ లో బినామీల పేర్లు నమోదు
  •     సెంటర్ ఇన్​చార్జ్ తో మార్కెట్ పాలకవర్గం వాగ్వివాదం

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్​జిల్లా జమ్మికుంట మార్కెట్​లోని గన్నీ సంచులు మాయమవుతున్నాయి. మార్కెట్​లో మక్కల కుప్పలు లేకున్నా గన్నీ సంచులను బినామీ రైతుల పేర్లపై సెంటర్ ఇన్​చార్జ్ బయటకు తరలిస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​లో వారం రోజులుగా దళారుల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెట్​లో ఈనెల 14న రిజిస్టర్​లో 126 మంది పేర్లు రాసి ఉన్నాయి. కానీ ఆరోజు కేవలం 63 మంది రైతులు మాత్రమే మార్కెట్​లో మక్కలు కుప్పలు పోసి బార్ధాన్ తీసుకున్నారు. 

15న 97 మంది పేర్లు రిజిస్టర్​లో నమోదు కాగా కేవలం 47 మంది మాత్రమే రైతులు ఉన్నట్లు తేలింది. వారం రోజులుగా సెంటర్ ఇన్​చార్జ్ దళారులతో కుమ్మక్కై మార్కెట్​లో నిజమైన రైతులకు సంచులు ఇవ్వకుండా బయట వ్యాపారం చేసుకునే వారికి సహకరిస్తూ వారికి ఇస్తున్నారు. ఫలితంగా రైతులు మార్కెట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ సభ్యులు గురువారం సెంటర్ ఇన్​చార్జ్​అశోక్​ను ప్రశ్నించగా వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. తమను మోసం చేస్తున్నావంటూ సెంటర్ ఇన్​చార్జ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులతో కుమ్మక్కై మక్కలను రూ.1600 , 1700కే క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి అవే మక్కలను తిరిగి మార్క్​ఫెడ్ కు అమ్ముతున్నారని. రవాణా చేసే లారీల విషయంలోనూ గోల్​మాల్ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు మార్కెట్ చైర్​పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు.