
- మూడు రోజులుగా జనగామలోనే..
జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన బిడ్డ తుల్జా భవాని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫోర్జరీ సంతకాలు ఎందుకు చేశావని నిలదీస్తూ వెంబడిస్తున్నంత పని చేస్తోంది. గత నెల 9 హైదరాబాద్ ఉప్పల్ పీఎస్లో ఫోర్జరీ కేసు పెట్టిన ఆమె ఈనెల 19న జనగామ హరితోత్సవంలో నిలదీసింది. జనగామకు రాజునంటావ్.. సంతకం ఫోర్జరీలు ఏమిటని ప్రశ్నించింది.
ఇదే క్రమంలో మంగళవారం కూడా మరోసారి జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఆమె ముత్తిరెడ్డి కోసం కాసేపు ఎదురుచూసింది. బుధవారం కూడా జనగామకు వచ్చింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొననున్నాడనే సమాచారంతో బస్టాండ్ సమీపంలోని చర్చి వద్ద, రైల్వేస్టేషన్ సమీపంలోని మసీదు దగ్గరకు వచ్చి ఎదురుచూసింది. కానీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది.