
ఖైరతాబాద్ : జర్నలిస్టులకు రెగ్యులర్ హెల్త్ చెకప్ తప్పనిసరి అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. వీడియో జర్నలిస్టులు 24 గంటల పాటు పని ఒత్తిడిలో ఉంటారన్నారు. ఎంతోమంది అనారోగ్యాల బారినపడుతున్నారన్నారు. జర్నలిస్టుల కోసం హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తే ముందస్తుగా అనారోగ్యాన్ని గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
జర్నలిస్టులు ఐక్యత పాటించాలన్నారు. హెల్త్ క్యాంప్ లో జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు బీపీ, షుగర్, బీఎండీ, ఈసీజీ, కంటి స్ర్కీనింగ్, ఆర్థొపెడిక్, దంత పరీక్షలను నిర్వహించి మెడిసిన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, అసోసియేషన్ అధ్యక్షుడు వనం నాగరాజు, ప్రధాన కార్యదర్శి నండూరి హరీశ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.