ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం... కూరగాయల మాటున గుట్టుగా రవాణా..

ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం... కూరగాయల మాటున గుట్టుగా రవాణా..

ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూరగాయల మాటున గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు విశాఖ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహించిన అధికారులు ట్రక్కులో కూరగాయల మాటున రవాణా చేస్తున్న 647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి సిమిలిగూడ ప్రాంతం నుంచి వస్తున్న మినీ ట్రక్కును తనిఖీ చేయడంతో గుట్టు రట్టయ్యింది.

స్మగ్లర్లు వాహనం నుంచి గంజాయి వాసన బయటికి రాకుండా పేపరు కవర్లలో ప్యాక్‌ చేసి ప్లాస్టిక్‌ టేపుతో సీల్‌ చేశారని తెలిపారు అధికారులు. పోలీసుల తనిఖీల్లో దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ట్రాలీ అడుగున గంజాయి పెట్టి.. దాని మీద కూరగాయల బుట్టలు పెట్టినట్లు తెలిపారు అధికారులు.

►ALSO READ | తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్ నాయుడు రాజీనామాకు వైసీపీ డిమాండ్... అడ్డుకున్న టీడీపీ

మొత్తం 123 ప్యాకెట్లలో 647 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయి విలువ రూ. 3 కోట్ల 20 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు. ఒడిశా నుంచి ఏపీలో ప్రవేశించిన గంజాయి ట్రక్కు ఆరు పోలీస్ స్టేషన్లను దాటుకొని వచ్చి బొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుబడిందని తెలిపారు అధికారులు. ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి వాహనాన్ని గుర్తించకపోవడం అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు అధికారులు.

ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ గంజాయి రాకెట్ వెనక ఎవరున్నారు..? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు అధికారులు.