ఉగాది రెసిపీలు : ఘుమఘుమలాడే మామిడి పులిహోర, సగ్గు బియ్యం దద్దోజనం తయారీ విధానం ఇలా..!

ఉగాది రెసిపీలు : ఘుమఘుమలాడే మామిడి పులిహోర, సగ్గు బియ్యం దద్దోజనం తయారీ విధానం ఇలా..!

తెలుగువాళ్లంతా ఈ ఉగాది పండుగ కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు. ఈఏడాది (2026) మార్చి 19 న  తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి.. ఇదే తెలుగు వారి తొలి పండుగ.. షడ్రుచుల (తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు, పులుపు) తో తయారు చేసే పచ్చడి ఉగాది స్పెషల్, ఒక్క పచ్చడితో పండుగ పూర్తవ్వదు కదా. అందుకే ఈ పండుగ రోజు సంప్రదాయాన్ని పాటిస్తూ.. కొత్తదనంతో వంటలు చేసి వడ్డిస్తే.. పిల్లలతో పాటు ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా, లొట్టలేసుకుంటూ తింటారు. మరి అలాంటి కొత్త వంటలను చేసేద్దామా... 

మామిడి పులిహార తయారీకి కావలసినవి

  • అన్నం: మూడు కప్పులు 
  • పుల్లటి మామిడికాయ: ఒకటి
  •  శెనగపప్పు: ఒకటీ స్పూన్
  •  పల్లీలు :పావు కప్పు
  • జీడిపప్పు పలుకులు :పది
  •  మినప్పప్పు :ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి: నాలుగు
  • ఎండుమిర్చి :ఐదు 
  • కరివేపాకు: రెండు రెమ్మలు 
  • ఉప్పు :తగినంత
  • నూనె: సరిపడా
  •  జీలకర్ర  :అర టీస్పూన్
  • ఆవాలు :అరటీస్పూన్ 
  • పసుపు: పావు టీ స్పూన్
  •  ఇంగువ :కొద్దిగా 
  • నువ్వులు :రెండు టీ స్పూన్లు
  • మెంతులు :అర టీ స్పూన్
  • ధనియాలు  :ఒక టీ స్పూన్

మామిడి పులిహార తయారీ విధానం

  ఒక వెడల్పాటి పళ్లెంలో అన్నాన్ని అరబెట్టాలి. మరోవైపు మామిడికాయ చెక్కు తీసి సన్నగా తురిమి అన్నంలో కలపాలి. అలాగే పచ్చిమిర్చిని పొడవుగా చీల్చాలి. 

తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులను విడివిడిగా వేగించి పొడి కొట్టుకోవాలి. స్టవ్​ పై పాన్​ పెట్టి  నూనె వేడి చేయాలి. 

అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, సువ్వుల పొడి వేసి పోపు పెట్టాలి. దాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోరని కొత్త సంవత్సరం మొదటి పండుగరోజు టేస్ట్​ చేయాల్సిందే


సగ్గుబియ్యం తో దద్దోజనం తయారీకి కావలసినవి

  • సగ్గుబియ్యం :ఒక కప్పు
  • పెరుగు :రెండు కప్పులు
  • పాలు :పావు కప్పు
  •  పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్
  •  అల్లం తరుగు :అర టీ స్పూన్ 
  • శెనగపప్పు :అర టేబుల్ స్పూన్ 
  • మినప్పప్పు: అరటేబుల్ స్పూన్
  • ఆవాలు పావు: టీ స్పూన్
  • జీలకర్ర :అరటీస్పూన్
  • కరివేపాకు :రెండు రెమ్మలు
  •  జీడిపప్పు: పది
  • నూనె లేదా నెయ్యి: సరిపడా
  • కొత్తిమీర తరుగు :అరటేబుల్ స్పూన్
  • పుదీనా తరుగు :ఒక టేబుల్ స్పూన్ 
  • ఉప్పు: తగినంత 

సగ్గుబియ్యం తో దద్దోజనం తయారీ విధానం

నాలుగు గంటలపాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. మరోవైపు స్టవ్​ పై పాన్​ లో నూనె లేదా నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వేయాలి. 

తర్వాత పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేయాలి. ఆపైన నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. అవి బాగా మగ్గాక దింపేయాలీ. మరోవైపు వెడల్పాటి గిన్నెలో పెరుగు, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 

అందులో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేయాలి కావాలనుకుంటే బూందీ వేసుకోవచ్చు. అంతే, దద్ధోజనం రెడీ..

►ALSO READ | ఉగాది 2026 : తెలుగు వారి తొలి ప్రకృతి పండుగ ఉగాది.. పురాణాల్లోని విశిష్ఠత అందరూ తెలుసుకోవాలి..!