
- రాష్ట్రవ్యాప్తంగా 64 శాతం మంది లింక్ చేసుకున్నరు
- ఇతర రాష్ట్రాల్లో ఉండి.. తెలంగాణలో నమోదైన 30 వేల డబుల్ ఓట్లు తొలగించినం
- ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక నుంచి వెయ్యి మంది ఓటర్లే
- హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు కొంత సమయం పట్టొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే, ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అన్నారు. అసెంబ్లీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే, ఆ గెజిట్ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వెల్లడించారు.
ఇప్పటికే దేశంలోని ఇతర రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ రాకపోవచ్చని అంచనా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 87వేల 206 మంది ఓటర్లున్నారని, ఈ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం (జూన్ 17) హైదరాబాద్లోని బీఆర్కే భవన్ సీఈవో సుదర్శన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాదని, అది పూర్తిగా ఆప్షనల్ అని తెలిపారు. ఒకవేళ తప్పనిసరి చేస్తే ఓటర్లపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 67 శాతం మంది ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 84 శాతంగా ఉందని తెలిపారు. డబుల్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని అన్నారు. ఇప్పటివరకు 58 వేల మంది డబుల్ ఓటర్లను తొలగించగా, వారిలో 30 వేల మంది ఏపీ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలోనూ నమోదై ఉన్నారని గుర్తించినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రిఫరెన్స్లతోనే ఈ ఓటర్లను రాష్ట్ర ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
ఒక్క పోలింగ్ స్టేషన్ లో వెయ్యి మంది ఓటర్లు
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి వెయ్యికి తగ్గించినట్లు తెలిపారు. దీనివల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య, బూత్ల సంఖ్య పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలలోనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షల దూరాన్ని 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించారని, ఇకపై పోలింగ్ సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్ల కోసం డిపాజిట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీలో బీఎల్వోలకు కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.