
- ‘ప్రాణహిత’ ఎందుకు పక్కన పెట్టిన్రు? : జస్టిస్ పీసీ ఘోష్
- రిటైర్డ్ ఇంజినీర్ల నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- 2015 నిపుణుల కమిటీ రిపోర్ట్ను గత సర్కారు దాచడంపై అనుమానం
- ఆ రిపోర్ట్ను వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
- జలసౌధలో ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ
- 7న కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ అందే అవకాశం
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ తన విచారణను స్పీడప్ చేసింది. అసలు ఆ ప్రాజెక్టు అవసరం ఎంత? దానికి పెట్టిన ఖర్చు, కడ్తున్న వడ్డీలు, కలుగుతున్న ప్రయోజనాలు వంటి ఆర్థిక అంశాలపై ఆరా తీస్తోంది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని.. కాళేశ్వరంలో భాగంగా దిగువన మూడు బ్యారేజీలు కట్టి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏడాదిపాటు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న చోట కాకుండా.. మూడు, నాలుగు నెలలు మాత్రమే ఫ్లడ్ వచ్చే చోట వేల కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ చేసుకోవడం ఏమిటని ఇంజినీర్లను అడిగి తెలుసుకుంటోంది.
శుక్రవారం జలసౌధలో జస్టిస్ ఘోష్.. ఈఎన్సీ (జనరల్), ఓఅండ్ఎం విభాగాల్లోని ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, పలు వివరాలను సేకరించారు. కాగా, 2015లో ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టేందుకున్న ఫీజిబిలిటీపై వేసిన ఫైవ్ మెంబర్స్ కమిటీ (అనంతరాములు కమిటీ) రిపోర్ట్ను బయటపెట్టకపోవడంపైనా కమిషన్అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ రిపోర్ట్ను వెంటనే తమకు అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సర్కార్ ఉన్నంతకాలం ఆ రిపోర్ట్ను దాచేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ రిపోర్టును బయటపెట్టింది. కాగా, ఆ రిపోర్ట్ను తాజాగా తనకు డిటెయిల్డ్గా అందజేయాలని జస్టిస్ ఘోష్ ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలుస్తోంది.
జులై ఫస్ట్వీక్లో రిపోర్ట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణలో వేగాన్ని పెంచిన జ్యుడీషియల్ కమిషన్.. అందరి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నది. అన్ని రిపోర్టులనూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నది. ఇదే క్రమంలో బ్యారేజీల డ్యామేజీపై నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కోసం వెయిట్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆ నివేదిక గురించి కూడా జస్టిస్ ఘోష్ ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటికే మధ్యంతర నివేదికను అందజేసిన ఎన్డీఎస్ఏ.. జులై 7న పూర్తి స్థాయి నివేదికను కమిషన్కు అందజేసేందుకు అంగీకరించినట్టు తెలిసింది.
దాంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పలు పరీక్షలను నిర్వహించిన పుణెకు చెందిన సెంట్రల్ వాటర్అండ్పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), ఢిల్లీకి చెందిన సెంట్రల్సాయిల్, మెటీరియల్రీసెర్చ్స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నివేదికలూ జులై తొలి వారంలో అందే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలను కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే. వారందరినీ అఫిడవిట్లు ఫైల్ చేయాల్సిందిగా జస్టిస్ ఘోష్ ఆదేశించారు.
ఆ అఫిడవిట్లు ఈ నెల 27 నాటికి అందే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం టెక్నికల్అంశాలపైనే ఫోకస్ పెట్టిన జస్టిస్ ఘోష్.. వచ్చిన అఫిడవిట్లు, రిపోర్టులన్నింటినీ పరిశీలించిన తర్వాతే మిగతా అంశాలపై విచారణ జరుపుతానని స్పష్టం చేస్తున్నారు. టెక్నికల్ అంశాలను పక్కనపెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థికాంశాలే అతిపెద్ద ఫోకస్ పాయింట్అని జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్టు తెలిసింది. దాని మీద సీరియస్గానే ఆయన విచారణ జరిపే అవకాశాలున్నాయని చెప్తున్నారు.
2015 నిపుణుల కమిటీ రిపోర్ట్ ఏంటి? ఏం చెప్పింది?
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలను ఎత్తిపోసేలా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేశారు. డాక్టర్బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకం కింద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావించారు. పనులనూ ప్రారంభించారు. దాదాపు ఐదు ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. తుమ్మడిహట్టి నుంచి మైలారం వరకు 71 కిలోమీటర్ల మేర కాలువను కూడా తవ్వారు. లైనింగ్ వేశారు.
అప్పటికే భూసేకరణకు రూ.900 కోట్లు సహా ప్రాజెక్టు పనులకు దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలోనే 2012లో మహారాష్ట్ర అడ్డుపుల్ల వేసింది. ముంపు సమస్య పేరుతో ప్రాజెక్టును 152 మీటర్లు కాకుండా 148 మీటర్ల ఎత్తులోనే కట్టాలని పేచీ పెట్టింది. బొగ్గు తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడతాయన్న కారణంతో ఇటు జైపూర్ వద్ద లిఫ్ట్ నిర్మాణానికి సింగరేణి సంస్థ కూడా ఎన్వోసీ ఇవ్వలేదు. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ప్రభుత్వం 2015లో ప్రాజెక్టుపై ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సీఈ అనంతరాములు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రిటైర్డ్ ఇంజినీర్లు వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్ రెడ్డి, శ్యాం ప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. అన్ని అంశాలనూ పరిశీలించిన కమిటీ పలు సిఫార్సులు చేసింది.
తొలి ప్రాధాన్యంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టడమే మంచిదని రిపోర్ట్లో కమిటీ స్పష్టం చేసింది. అది కాదు అనుకుంటే తుమ్మిడిహట్టికి దిగువన వేమనపల్లిలోని అర్జునగుట్ట వద్ద బ్యారేజీని కట్టుకుంటే బాగుంటుందని సిఫార్సు చేసింది. వార్ధా నది మీద బ్యారేజీని నిర్మిస్తే 30 టీఎంసీల వరకు అదనంగా ఎత్తిపోసుకోవచ్చని పేర్కొంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కడితే నీటిని లిఫ్ట్ చేయడం అంత మంచిది కాదని స్పష్టం చేసింది. ఇటు ఆర్థిక భారంతోపాటు అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా అంత మంచిది కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్టు కట్టేందుకయ్యే ఖర్చుతోపాటు ఏటా విద్యుత్ చార్జీలు భారంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే, అప్పటి ప్రభుత్వం మాత్రం ఆ కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా.. రిపోర్ట్ బయటపెట్టకుండా రీడిజైన్ పేరుతో తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.