ఇయ్యాల ( జూన్ 23) కేబినెట్ మీటింగ్ ..బనకచర్ల, స్థానిక ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ

ఇయ్యాల ( జూన్ 23) కేబినెట్ మీటింగ్ ..బనకచర్ల, స్థానిక ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌‌లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. 

ప్రతినెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈసారి జరగనున్న సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు, స్థానిక ఎన్నికల నిర్వహణ, సంక్షేమ పథకాలు, పలు ఇరిగేషన్ ​ప్రాజెక్టులపై చర్చించనుంది. 

ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్‌‌‌‌‌‌‌‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీతో జరిపే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూలంకషంగా చర్చించి.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. 

హైకోర్టులో ఉన్న కేసు, రిజర్వేషన్లు, ముందు సర్పంచ్​ఎన్నికలా లేదా ఎంపీటీసీనా? అనే అంశాలపై చర్చ జరిగే చాన్స్ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

 రైతు భరోసా పంపిణీ ఇప్పటికే 95 శాతం పూర్తయింది. మిగిలిన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు, వాటి సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో భూ భారతి చట్టం అమలు, అప్లికేషన్ల పరిష్కారంపైనా డిస్కషన్ జరగనుంది.