
మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టు వద్ద మెయింటెనెన్స్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. స్పిల్ వే పిల్లర్స్ దగ్గర రోప్ కింది భాగంలో హుక్కులు ఊడిపోయాయి. గేట్లు మూసివేసిన తర్వాతే మరమ్మత్తులకు అవకాశం ఉంటుంది. జూరాలకు వరద పెరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరిగేషన్ అధికారులు టెన్షన్ పడుతున్నారు. పై నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో గేట్లు మూసేసే పరిస్థితులు కనిపించడం లేదు. గేట్లు ఓపెన్ చేసిన సమయంలో మరమ్మతులు చేసేందుకు అవకాశం లేదు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 95 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో జూరాల 15 గేట్లు ఎత్తి 87,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 28,034 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్కు 315, రైట్ కెనాల్కు 298, లెఫ్ట్ కెనాల్కు 550, బీమా లిఫ్ట్ 1కు 650, ఆర్డియస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,16,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.