మహాలక్ష్మిలు.. : 11 రోజులు.. 3 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ

మహాలక్ష్మిలు.. : 11 రోజులు.. 3 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. 2023, డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ 11 రోజుల్లో.. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళలకు ఎన్ని ఉచిత టికెట్లు ఇచ్చారో తెలుసా.. అక్షరాల 3 కోట్ల ఉచిత టికెట్లు.. రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.  పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు. 

మహిళల ఉచిత ప్రయాణం మహాలక్ష్మి  స్కీం ఫలితంగా.. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. ఇప్పుడు 88 శాతానికి పెరిగింది. మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, -ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఆక్యుపెన్సీ సాధించాయి. 

ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి

ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాలని స్పష్టం చేస్తుంది ఆర్టీసీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి.. జీరో టికెట్లను తీసుకోవాలని వెల్లడించారు ఆర్టీసీ అధికారులు. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి.. టికెట్ తీసుకోవాలి అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. 

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ  సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు. 

త్వరలో 2 వేల 050 కొత్త బస్సులు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో 2 వేల 050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నాం. అందులో వెయ్యి 050 డీజిల్.. వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి తెస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రకటించారు.