
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఇంటికి తరలించారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు. లోకాయుక్త చైర్మన్ గా పనిచేసిన సుభాషణ్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో సుభాషణ్ రెడ్డి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మరొకరు ఇంజనీరు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్ లో జన్మించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ , చాదర్ ఘాట్ పాఠాశాలల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఉస్మానియాలో లా పూర్తి చేశారు. 1966 ఆ ప్రాంతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2001, సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మూడేళ్ల తర్వాత కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కు మొదటి ఛైర్మన్ గా పనిచేశారు.