
'సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్’ అని 'ఆకలి రాజ్యం'లో కమల్ హాసన్ తో పాడించాడు. ‘కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’ అంటూ అంతులేని కథలో జయప్రద బాధ చూపించాడు. దర్శక దిగ్గజంగా పేరు తెచ్చుకుని సౌత్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచాడు. ఆయన ఎవరో కాదు.. కె. బాలచందర్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలచందర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
నాటకాలపై ఆసక్తి
1930 జులై 9న తంజావూరు జిల్లా, నన్నిలం గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు బాలచందర్. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్లు టీచర్గా పని చేశారు. తర్వాత అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం రావడంతో చెన్నైకి వెళ్లారు. బాలచందర్కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆసక్తి. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవారు. కొన్నాళ్లకు సొంతగా ఓ ట్రూప్ను ఏర్పాటు చేసుకుని నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. మేజర్ సుందర్ రాజన్, నగేష్, షావుకారు జానకి తదితరులు ఆ ట్రూప్లో సభ్యులుగా ఉండేవారు.
బాలచందర్ రాసిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంగ్లిష్లో రాసిన ఈ డ్రామాను తర్వాత తమిళంలోకి ట్రాన్స్లేట్ చేశారు. సర్వర్ సుందర్, నీర్కుమిళి, మెళుగువర్తి, నానళ్, నవగ్రహం తదితర నాటకాలన్నీ బాలచందర్ కలం నుంచి జాలువారినే. ఎంజీఆర్ ప్రోత్సాహంతో సినిమాలు ‘దైవతాయి’ నాటకం ఎంజీ రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన నుంచి పిలుపు వచ్చింది. ఎంజీఆర్ ఆ కథని, అదే పేరుతో సినిమాగా తీశారు. ఆ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసే ఛాన్స్ బాలచందర్కి దొరికింది. ఆ వెంటనే ‘సర్వర్ సుందరం’ కూడా సినిమాగా రూపొందింది. ఇలా మూడు సినిమాలకి రైటర్గా వర్క్ చేసిన తర్వాత ‘నీర్కుమిళి’ సినిమాతో బాలచందర్ మెగాఫోన్ పట్టారు. అప్పటి బిజీ కమెడియన్ నగేష్ ను హీరోగా తీసుకున్నారు. కామెడీ యాక్టర్ తో రిస్క్ తీసుకోవడం ఎందుకని చాలా మంది చెప్పినా బాలచందర్ వినలేదు. ఆ కథకి నగేష్ పర్ఫెక్ట్ గా సూటవుతారన్న నమ్మకంతో సినిమా తీశారు.
సామాన్యుడి జీవితమే కథా వస్తువు
బాలచందర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేసరికి సినిమాలన్నీ హీరో ఓరియెంటెడ్గానే ఉండేవి. దీంతో ఆయన హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు. బాలచందర్ కథలన్నీ మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరిగేవి. సామాన్యుడి జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ప్రేమలు, పగలు, అభిమానాలు, ఆత్మగౌరవాలను సహజంగా అందరికీ అర్థమయ్యేలా చూపించేవారు. అందుకే బాలచందర్ సినిమాలకు సగటు ప్రేక్షకుడు బాగా కనెక్టయ్యేవాడు
.
ఇండస్ట్రీకి కమల్, రజనీ పరిచయం
అవకాశాలు పెరిగాక ఉద్యోగంలో కొనసాగాలా వద్దా అనే సందిగ్దంలో ఉన్న బాలచందర్ కు నిర్మాత మెయ్యప్పన్ ఇచ్చిన సలహాతో ఇండస్ట్రీలోనే సెటిలయ్యారు. కమల్ హసన్, రజనీకాంత్ వంటి నటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది బాలచందరే. వీళ్లిద్దరితో చాలా సూపర్ హిట్ చిత్రాలు చేశారాయన. అందుకే కమల్ ఆయనను మించిన గురువు లేడని అంటుంటారు. బాలచందర్ లేకపోయుంటే ఏ విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మిగిలిపోయి ఉండేవాడినని రజనీకాంత్ చాలా సందర్భాల్లో చెప్పారు.
క్లాసికల్ లవ్ స్టోరీ మరో చరిత్ర
తెలుగులో బాలచందర్ మొదటి సినిమా భలే కోడళ్లు. ఆ తర్వాత సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, తొలి కోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. కమల్ హాసన్, సరితలతో తీసిన ‘మరో చరిత్ర’ అయితే క్లాసికల్ లవ్ స్టోరీస్ లిస్టులో చేరింది. తెలుగులో ఆయన చివరి సినిమా ‘రుద్రవీణ’.
ఆలస్యంగా బాలీవుడ్ ఎంట్రీ
తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో వర్క్ చేసిన బాలచందర్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరిగింది. ‘మరో చరిత్ర’ను ‘ఏక్ దూజే కే లియే’ పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. హీరోగా కమల్నే తీసుకున్నా, హీరోయిన్ గా సరిత ప్లేస్లో రతి అగ్నిహోత్రికి చోటిచ్చారు. ఈ మూవీ కోసం ఎస్పీబీ పాడిన ‘తేరే మేరే బీచ్మే సాంగ్’ ఇప్పటికీ బీటౌన్లో మార్మోగుతోంది. ఆ తర్వాత తమిళ సినిమాల్ని జరాసీ జిందగీ, ఏక్ నయీ పహేలీ టైటిల్స్ తో రీమేక్ చేశారు. ‘దిలోంకా రాస్తా’ అనే డైరెక్ట్ మూవీ తీసినా అది రిలీజ్ కాలేదు.
టెలివిజన్ రంగంలోనూ ముద్ర
టెలివిజన్ రంగంలోనూ బాలచందర్ తిరుగులేని ముద్ర వేశారు. 20కి పైగా సీరియల్స్ కు వర్క్ చేశారు. ఆయన సీరియళ్లు టీఆర్పీ రికార్డులు బద్దలుకొట్టాయి. ‘కవితాలయ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ను స్థాపించి.. నేట్రికన్, 47 రోజులు, వెలైకరన్, రోజా తదితర చిత్రాల్ని నిర్మించారు. బాలచందర్కి డిసిప్లిన్ ఎక్కువ. టైమింగ్ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. తనకి కావలసిన ఎక్స్ ప్రెషన్ వచ్చే వరకు ఎన్ని టేకులైనా తీసుకునే వారు. బాల చందర్ దగ్గర పని చేసేవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవం. సెట్లో అడుగుపెట్టగానే లైట్ బాయ్ నుంచి హీరో వరకు అందరూ లేచి నిలబడేవారు. అంతటి గౌరవం ఇండస్ట్రీలో ఏ దర్శకుడిగా దక్కలేదని చాలా మంది చెబుతుంటారు. యాభయ్యేళ్ల కెరీర్లో బాలచందర్ దాదాపు వంద సినిమాలు తీశారు. తొమ్మిదిసార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. పదమూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది. ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
సినిమా స్థాయి పెంచిన బాలచందర్
బాలచందర్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో పని చేస్తున్నప్పుడే రాజంని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉదయ్ కిరణ్తో తీసిన తమిళ సినిమా ‘పోయి’ తర్వాత బాలచందర్ డైరెక్షన్ చేయలేదు. బాల చందర్ అనారోగ్య సమస్యలతో 2014 డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, వెళ్తారు. కానీ కొందరు మాత్రమే తమ ప్రతిభతో సినిమా స్థాయిని పెంచుతారు. అలాంటి వారిలో బాలచందర్ ముందుంటారు. ప్రేక్షకుడు ఆయన కథల్లో తన జీవితాన్ని చూసుకున్నాడు. ఆయన డిజైన్ చేసిన పాత్రలతో తనని తాను పోల్చుకున్నాడు. అందుకే బాలచందర్ తీసిన ప్రతి సినిమా మనసుల్ని తాకింది. పదికాలాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా నిలిచిపోయింది.