
డైరక్టర్ రామ్ గోపాల్ వర్మపై మరోకేసు నమోదైంది. ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు నోచుకుంటోంది. సినిమాకు సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్ను జారీ చేసింది. సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్న వర్మ కన్ఫామ్ చేశారు.
దీంతో వర్మ సినిమా పబ్లిసిటీ షురూ చేశారు. చంపేస్తాడు..బాబు చంపేస్తాడంటూ ఓ సాంగ్ ను రిలీజ్ చేసి సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో అంత వివాదాస్పదంగా మారింది.
ఈ సినిమాకు వర్మ తొలిసారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ పెట్టారు. కానీ ముందుగా ఊహించినట్లుగానే సినిమాకు రాజకీయ సెగ తగిలింది. సినిమాలోని పాత్రలు మాజీ సీఎం చంద్రబాబు, నారాలోకేష్, పవన్ కల్యాణ్, జగన్, కేఏపాల్ ను పోలి ఉన్నాయంటూ పలువురు వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా వర్మపై కేఏపాల్ కోడలు బెగాల్ జ్యోతి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్ కు తమ ఫోటోలను ఆర్జీవి మార్ఫింగ్ చేసి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న బెగాల్ జ్యోతి.
గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో తాము దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని , ఆర్జీవి పై చర్యలు తీసుకొని ఆ ఫోటోలను తొలగించాలని జ్యోతి కోరింది. ఐపీసీ 469 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వర్మ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఐపీ నెంబర్ కోసం అన్వేషిస్తున్నారు.