
- కొలిక్కిరాని భూ సేకరణ, రెండు ప్యాకేజీల్లో 431 ఎకరాలు పెండింగ్
- ఏండ్లు గడుస్తున్నా చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
నాగర్కర్నూల్, వెలుగు:ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మూడు జిల్లాలకు సాగునీటిని అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించినా భూసేకరణ కొలిక్కిరావడం లేదు. రెండు ప్యాకేజీల్లో 431 ఎకరాల భూ సేకరణ పెండింగ్లో ఉండడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టి 20 ఏండ్లు దాటుతున్నా పూర్తి స్థాయిలో సాగునీటిని అందించలేకపోతోంది.
బడ్జెట్లో ఫండ్స్ కేటాయించినా..
కాంగ్రెస్ సర్కార్ ఈ బడ్జెట్లో కల్వకుర్తి ప్రాజెక్ట్కు రూ.800 కోట్లు కేటాయించింది. కేఎల్ఐలోని 29, 30వ ప్యాకేజీల్లో చివరి భూములకు నీరందించేందుకు 431 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటిని అందిస్తున్న 30వ ప్యాకేజీలో 279 ఎకరాలు, 29వ ప్యాకేజీలో కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు నీరందించేందుకు 152 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణ అనంతరం బ్రాంచ్ కెనాల్స్, ఫీడర్ చానల్స్, స్ట్రక్చర్లు, మైనర్ కాల్వల నిర్మాణం చేయాలి.
ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు నలిగి పోతున్నారు. కొన్ని మండలాల్లో భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. రైతుల అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. భూ సేకరణపై అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.
కెపాసిటీ పెంచకుండానే ఆయకట్టు పెంచేశారు..
కేఎల్ఐ స్కీంలో మూడు ప్యాకేజీల కింద 2.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని డిజైన్ చేశారు. అదనంగా రిజర్వాయర్లు, లిఫ్ట్లు కట్టకుండా, కాల్వల కెపాసిటీ పెంచకుండానే 4.30 లక్షల ఎకరాలకు నీరు పారించేందుకు ఇంజనీర్లు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొల్లాపూర్ నుంచి నాగర్కర్నూల్ మధ్య కేఎల్ఐ మెయిన్ కెనాల్ నుంచి పస్పుల, ఘన్పూర్, పాన్గల్ బ్రాంచి కెనాల్స్ తెరిచి వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలకు నీటిని మళ్లించారు. కేఎల్ఐలోని మూడవ లిఫ్ట్ కింద ఉన్న రెండు ప్యాకేజీలకు నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
30వ ప్యాకేజీలో 279 ఎకరాల భూ సేకరణ పూర్తి అయితేనే హాజీపూర్, నడింపల్లి, చంద్రాపూర్ గ్రామాల వరకు సాగునీరు చేరుతుంది. దీనికి అవసరమైన 54 ఎకరాల భూ సేకరణ ఇంకా సర్వే దశలోనే ఉంది. సర్వే పూర్తి చేశాక రైతులు భూములిస్తేనే చంద్రాపూర్ వరకు సాగునీరు వెళ్తుంది. ఇందులో ఫీడర్ చానల్స్ నిర్మాణం చేయాల్సి ఉంది. భూ సేకరణ, పరిహారం చెల్లింపు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు పూర్తి చేయాల్సిఉంటుంది. ఈ ప్రాజెక్ట్కు భూములిచ్చిన రైతుల్లో కొందరికి ఇప్పటికీ పరిహారం డబ్బులు అందకపోయినా, ఇరిగేషన్ అధికారులు మాత్రం పనులు మొదలు పెట్టేశారు. కల్వకుర్తి లిఫ్ట్లోని 29వ ప్యాకేజీలో 310 ఎకరాలకు గాను, 158 ఎకరాలకు సంబంధించిన పరిహారం రైతులకు చెల్లించారు.
మిగిలిన 152 ఎకరాలలో 57 ఎకరాలు సర్వే దశలో ఉంది. తాడూరు, తిమ్మాజీపేట ప్రాంతాల్లో రైతుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని తెలిసినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రెండు సార్లు పరిశీలించినా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని చెబుతున్నారు.
ఎల్లూరు పంప్హౌజ్ పరిస్థితి అంతే..
ఐదేండ్ల కింద మునిగిన ఎల్లూరు పంప్హౌజ్లో మూలకుపడిన రెండు పంప్లను వేసవిలో రిపేర్ చేపిస్తామని ప్రకటించి ఐదేండ్లు పూర్తవుతున్నా ముందుకు పడడం లేదు. ఎల్లూరులో ఐదు పంపుల్లో రెండు పంపులు మూలనపడితే మూడు పంపులకు రెస్ట్ లేకుండా నడిపిస్తున్నారు. ఆరు నియోజకర్గాల్లో రెండు సీజన్లకు సాగునీరు, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగు నీటిని అందించే మిషన్ భగీరథకు ఎల్లూరు పంప్హౌజ్ ప్రధాన వనరుగా ఉంది.
29, 30 ప్యాకేజీల కింద భూ సేకరణ, రైతులకు పరిహారం, నిర్మాణాలు జరిగి, ఎల్లూరు పంప్హౌజ్లో మూలకు పడ్డ రెండు పంప్లు అందుబాటులోకి వస్తేనే చివరి ఆయకట్టుకు సాగు నీటిని అందించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.