కరోనా టెస్టుల్లో నెగిటివ్.. ముంబైకి పయనమైన కంగనా

కరోనా టెస్టుల్లో నెగిటివ్.. ముంబైకి పయనమైన కంగనా

షిమ్లా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని తన హోంటౌన్ మండి నుంచి ముంబైకి బయలుదేరారు. చండీగఢ్ కు రోడ్డు మార్గంలో చేరుకుని, అక్కడి నుంచి ఫ్లయిట్ లో బొంబాయికి చేరుకోనున్నారు. మనాలీలోని మెడికల్ టీమ్ కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి ఛండేల్ ల స్వాబ్ శాంపిల్స్ తీసుకొని కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిల్లో వారిద్దరికీ నెగిటివ్ గా తేలింది. శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ తో మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబై టూర్ ఆసక్తి రేకిత్తిస్తోంది. దీనిపై గత వారం ఆమె ఓ ట్వీట్ చేసింది.

‘శివ సేన నేత సంజయ్ రౌత్ నన్ను ముంబైకి రావొద్దని బహిరంగంగా బెదిరించారు. ముంబై వీధుల్లో ఆజాదీ గ్రాఫిటీల తర్వాత ఇప్పుడు బహిరంగ బెదిరింపులను చూస్తున్నాం. ఎందుకు ముంబై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లా అనిపిస్తోంది?’ అని కంగనా వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగనా పీవోకే కామెంట్స్ పై శివ సేనతోపాటు కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత ఊర్మిలా మతోండ్కర్ కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో కంగనా ముంబైకి రానుండటంపై ఆసక్తికరంగా ఉంది. దీంతో హిమాచల్ పోలీస్ చీఫ్ సంజయ్ ఖండూ ఆమెకు వై ప్లస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కల్పించారు.