పంజాగుట్ట, వెలుగు: జయంత్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26న గచ్చిబౌలి స్టేడియంలో ‘లార్జెస్ట్ కరాటే డిస్ప్లే’ కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జయంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పది రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని, కేవలం 20 నిమిషాల వ్యవధిలో తమ కరాటే, తైక్వాండో విన్యాసాలను ప్రదర్శించనున్నారని వివరించారు.
6 ఏండ్ల పిల్లల నుంచి 70 ఏండ్ల వృద్ధుల వరకు ఈ రికార్డు ప్రయత్నంలో భాగస్వాములు కానున్నారని, ఆసక్తి గల వారు 63044 22818 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో కరాటే నిపుణులు విఠల్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

