- కరీంనగర్ జీజీహెచ్లో నిరుపయోగంగా ట్రామా కేర్ సెంటర్
- ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రాలేదు.. మ్యాన్ పవర్ ఇవ్వలేదు
- ప్రారంభించి వదిలేసిన వైద్య, ఆరోగ్య శాఖ
- జిల్లాలో రోజుకు రెండు, మూడు యాక్సిడెంట్లు
కరీంనగర్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు గోల్డెన్ అవర్(మొదటి గంట)లో ట్రీట్ మెంట్ అందించేందుకు ఉపయోగపడే ట్రామా కేర్ సేవలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ట్రామా కేర్ బిల్డింగ్ను ప్రారంభించి నెలలవుతున్నా.. పూర్తి స్థాయిలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రాకపోవడం, అవసరమైన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని కేటాయించకపోవడంతో సెంటర్ నిరుపయోగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్.. అలైవ్ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే ప్రైవేట్ హాస్పిటల్స్నే ఆశ్రయించాల్సి వస్తుండగా, ట్రీట్మెంట్ ఖర్చు రూ.లక్షల్లో అవుతోందని బాధితులు వాపోతున్నారు.
అందుబాటులోకి రాని ఆక్సిజన్ బెడ్స్..
కరీంనగర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయ్యాక జిల్లా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా అప్ గ్రేడ్ అయింది. అన్ని రకాల వైద్య విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్ను నిరుడు జూలై 27న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. 50 బెడ్స్ తో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆర్థో, న్యూరో, కార్డియాలజీ, పల్మనాలజీ తదితర విభాగాలు అందుబాటులోకి వస్తాయని భావించారు. సెంటర్ ప్రారంభించి 10 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో క్రిటికల్ కేర్కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు.
ఆపరేషన్ థియేటర్లు ఓపెన్ చేయాలంటే ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆ సౌకర్యం లేదు. ఆపరేషన్ థియేటర్ ఎక్విప్ మెంట్, ఐసీయూ ఎక్విప్ మెంట్ కొద్దిగాకొద్దిగా వస్తోంది. అయినప్పటికీ ట్రామా కేర్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో పేరుకు హాస్పిటల్లో క్రిటికల్ కేర్ ఉన్నా.. ఆపత్కాలంలో క్షతగాత్రులకు భరోసా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందులో రెండు వార్డులు మాత్రమే తాత్కాలికంగా నిర్వహిస్తుండగా.. బిల్డింగ్ లోని మిగతా గదులన్నింటికీ తాళాలు వేశారు.
ఎక్విప్మెంట్, స్టాఫ్ లేదు..
హాస్పిటల్కు పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు... కొద్దికొద్దిగా వస్తున్నాయి. సుమారు 50 మంది వరకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా.. ఇప్పటిదాకా కేటాయించలేదు. నిరుపయోగంగా వదిలేస్తే బిల్డింగ్ కరాబ్ అవుతుందని ఉన్నవాళ్లతోనే రెండు వార్డులు రన్ చేస్తున్నాం. అవసరమైన ఎక్విప్ మెంట్, మ్యాన్ పవర్ విషయమై ప్రభుత్వానికి నివేదించాం.
-వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్
సంవత్సరం యాక్సిడెంట్లు క్షతగాత్రులు మృతులు
2023 673 651 215
2024 774 716 200
2025 765 701 192
