డ్రైవర్, కండక్టర్ల మంచి మనసు: బస్సులో అందరికీ ఫ్రీగా మాస్కులు

డ్రైవర్, కండక్టర్ల మంచి మనసు: బస్సులో అందరికీ ఫ్రీగా మాస్కులు

దేశంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయపడిపోతున్నారు. ప్రయాణాల్లో ఎవరు దగ్గినా, తుమ్మునా వారి వైపు అదోలా చేస్తున్నారు. ఈ భయంతో చాలా మంది బయటకు వెళ్తే మాస్కులు ధరిస్తున్నారు. అయితే మెడికల్ షాపుల్లోనూ వీటి కొరత, అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ తమ మంచి మనసును చాటుకున్నారు. బస్సులో ప్రయాణికులకు ఉచితంగా మాస్కులు పంచారు. వారు చేసిన మంచిపనికి ప్రయాణికులంతా మెచ్చుకున్నారు.


యరగుప్పి-హుబ్లీ మధ్య ప్రయాణించే కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ హెచ్‌టీ మయాన్నవర్, కండక్టర్ ఎంఎల్ నడాఫ్ సొంత డబ్బుతో మాస్కులు కొని బస్సులో అందరికీ పంచారు. ఎక్కడ కరోనా వైరస్ బారినపడుతామోనని ప్రజలు భయపడుతున్నారని, ప్రయాణాలు కూడా చేయడం లేదని ఆ ఇద్దరు చెబుతున్నారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు ఇలా ఉచితంగా మాస్కులు పంచామని తెలిపారు. ప్రభుత్వమే అందరికీ ఫ్రీగా మాస్కులు అందజేయాలని వారు కోరుతున్నారు.