IPL 2026: ఏడాది విరామం తర్వాత బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ హైప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడనుంది. మార్చి 13వ తేదీన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ స్టేడియాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై మాక్ డెమో నిర్వహించింది. అనంతరం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో స్టేడియంలో పూర్తి సామర్థ్యంతో మ్యాచ్లు నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయంపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ అధ్యక్షతన విధాన సౌధలో సమావేశం జరిగింది. ఇందులో నిపుణుల కమిటీ, కేఎస్సీఏ, ఆర్సీబీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలపై కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం మ్యాచ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్ మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆర్సీబీ తమ రెండు హోమ్ మ్యాచ్లను రాయపూర్లో కూడా ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఆర్సీబీ మే 31న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్తో పాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ ఏప్రిల్ 12వ తేదీ వరకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో మిగతా మ్యాచ్ల షెడ్యూల్ త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
2025వ సంవత్సరంలో ఆర్సీబీ ట్రోఫీ విజయం సాధించిన తర్వాత జరిగిన సంబరాల్లో భారీగా జనసందోహం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం స్టేడియంలో పెద్ద మ్యాచ్లు జరగలేదు. ఈ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మైకేల్ డి’కున్హా కమిషన్ స్టేడియాన్ని భారీ జనం రావడంతోనే ఈవెంట్లను తాత్కాలికంగా అనుకూలం కాదని పేర్కొంటూ కొన్ని మార్పులు సూచించింది. ఈ కారణంతోనే ముందుగా కేటాయించిన మహిళల ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల హక్కులను కూడా ఈ వేదికలో జరగలేదు. ఇప్పుడు అవసరమైన మార్పులు చేసిన తర్వాత మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
