పునీత్ కు 'కర్ణాటకరత్న'... అవార్డును అందుకున్న అశ్విని

పునీత్ కు 'కర్ణాటకరత్న'...  అవార్డును అందుకున్న అశ్విని

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.  బెంగళూరులోని విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా రజనీకాంత్, ఎన్టీఆర్ హాజరయ్యారు. 67వ కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా పునీత్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. పునీత్ సతీమణి అశ్విని ఈ  అవార్డును స్వీకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం వారు లెక్కచేయకుండా  కూర్చున్నారు.  పునీత్ రాజ్‌కుమార్‌కు అవార్డు రావడం ఆనందంగా ఉందని అశ్విని పునీత్ రాజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కర్ణాటక రత్న అవార్డు ఇప్పటివరకు తొమ్మిది మందికి మాత్రమే లభించింది. చివరిసారిగా 2009లో డాక్టర్ వీరేంద్ర హెగ్గడే సామాజిక సేవకు గానూ కర్ణాటక రత్న అవార్డును అందుకున్నారు. ముందుగా  పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గానూ 1992లో ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.