ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే..టీటీడీపీ నేతల డిమాండ్

ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే..టీటీడీపీ నేతల డిమాండ్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసు కోగా, పోటీ చేయాల్సిందేనని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్టీఆర్‌‌ ట్రస్ట్‌‌ భవన్‌‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌  సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా తెలం గాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. అయితే నేతలు అందుకు ఒప్పుకోలేదు. ఈసారి ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని పట్టుబట్టారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. 

దీంతో అటు హైకమాండ్ ఆదేశాలను కాదనలేక, ఇటు రాష్ట్ర నేతలను బుజ్జగించలేక కాసాని ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. చివరకు ఎన్నికల్లో పోటీపై మరోసారి హైకమాండ్ తో చర్చిస్తానని నేతలకు సర్ది చెప్పారు. టీటీడీపీ నేతల నిర్ణయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.