
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులివ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ సర్కార్ నోటీసులిచ్చిందన్నారు. కేటీఆర్ కు నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని విమర్శించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని చెప్పారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు , హరీశ్ రావుకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే..
కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో కవిత లేఖ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ దేవుడని..ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.ఆ దెయ్యాలు కోవర్టులు ఎవరని చర్చనీయాంశంగా మారింది.అన్నాచెల్లెల్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసింది. సామాజిక తెలంగాణ ఎజెండాతో కవిత కొత్త పార్టీ పెడతారనే చర్చ కూడా జరిగింది.
అయితే ఇవాళ మే 26న కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఎంపీ దామోదర రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు కవితతో భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. కేటీఆర్,కేసీఆర్ ఆదేశాలతోనే వీరి సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. అనంతరం కేటీఆర్ నోటీసులివ్వడంపై కొన్ని గంటలకే కవిత తన ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సోమవారం (మే 26) ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025 మే 28న విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈకేసులో ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డితో పాటు ఈ కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. అప్పట్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.