
కొత్తకోట, వెలుగు: తెలంగాణ ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా దోచుకున్న డబ్బులు పంచుకోవడంలో తేడాలు రావడంతోనే, కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయితీ వచ్చిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ గార్డెన్లో శుక్రవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్, మైనార్టీలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుపేదలను గుర్తించి ఇండ్లు కట్టిస్తోందని చెప్పారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలతో కొ త్తకోట మండలంలోని మిరాసిపల్లి, పామాపురం గ్రామాల్లో 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మండలం మొత్తం ఇండ్లు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. మండలానికి 448, కొత్తకోట పట్టణానికి 146 ఇండ్లను మంజూరుచేశామని తెలిపారు. రెండు నెలల కింద రామనంతపురం గ్రామానికి 66 ఇండ్లు ఇచ్చామని గుర్తు చేశారు. కొత్తకోటలో 2,440 రేషన్కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, శ్రీను, బీచుపల్లి, పీజే బాబు, బోయజ్, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, రాము, మోహన్రెడ్డి పాల్గొన్నారు.