యాదాద్రి లక్ష్మినరసింహ స్వామివారి విమానగోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇందు కోసం 125 కిలోల బంగారం అవసరమన్నారు. ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం స్వామి వారికి అందిస్తున్నామన్నారు . మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ ఇస్తారని చెప్పారు.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇస్తారన్నారు. భాస్కర్ రావు కావేరి సీడ్స్ తరపున కేజీ బంగారం ఇస్తారని చెప్పారు. జీయర్ పీఠం నుంచి కూడా ఒక కేజీ బంగారం ఇస్తారన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు బంగారం ఇస్తారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయని.. ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే.. రిజర్వ్ బ్యాంక్ నుంచి బంగారం కొంటామన్నారు. ప్రతీ గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా సరిపోతుందన్నారు.
హెటిరో చైర్మన్ పార్థ సారధి రెడ్డి 5 కిలోల బంగారం
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారధి రెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన కుటుంబం తరపున ఈ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భారీ విరాళం
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రికి.. మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భారీ విరాళం ప్రకటించారు. విరాళం ప్రకటించిన వారిలో ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఉన్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి కుటుంబ సభ్యులు కలసి కిలో బంగారం డొనేట్ చేస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం ఆరుగురు ఆరు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు.