- జిల్లాల నుంచి 2,300 బస్సుల్లో జనం తరలింపు
- జాతీయ సమైక్యతా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 10.30కు పబ్లిక్ గార్డెన్స్లో
- జెండా ఆవిష్కరించనున్న సీఎం
హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10.30 గంటలకు పబ్లిక్ గార్డెన్స్లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత.. జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జెండాను ఎగురవేసి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్నాహ్నం మూడు గంటల తర్వాత తెలంగాణ ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 33 జిల్లాల నుంచి 2,300 బస్సుల్లో లక్ష మందిని తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కుమ్రం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ను ప్రారంభించాక ఎన్టీఆర్ స్టేడియానికి సీఎం వెళ్తారు. నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండ్, లంబాడీ తదితర 30 కళారూపాల కళాకారులతో ఎన్టీఆర్ స్టేడియం దాకా ర్యాలీ నిర్వహించనున్నారు. 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.