
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ చంచల్ గూడా జైలుకు వెళ్తారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఎన్ని డెడ్లైన్లు పెట్టినా 300 మంది కార్మికులు కూడా ఉద్యోగంలో చేరలేదని ఆయన అన్నారు. దీన్నిబట్టి కేసీఆర్ అంటే భయపడే రోజులు పోయాయని.. కార్మికులను, ప్రజలను చూసి కేసీఆర్ భయపడే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి మనిషిరూపంలో ఉన్న రాక్షసుడని ఆయన విమర్శించారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా కేసీఆర్లో ఇసుమంత చలనం కూడా లేదని ఆయన అన్నారు.
పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లల్లో 60 వేల కోట్ల అప్పు ఉంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ అప్పు 2 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన అన్నారు. ఈ అప్పులన్నీ కేసీఆర్ ఆడంబరాలకే అయ్యాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ చంచల్ గూడా జైల్లో ఉంటారని ఆయన అన్నారు. ‘ఇలాంటి అప్పుల తెలంగాణ కోసమా నేను మంత్రి పదవి వదులుకుంది’ అని ఆయన భాధపడ్డారు.
అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు గురైనట్లు ఆమె భర్త ఫిర్యాదు చేశారని కొమటిరెడ్డి అన్నారు. విజయారెడ్డి చాలా మంచి అధికారని ఆయన ఆమెను గర్తుచేసుకున్నారు. ఆమె హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మోడీ మాట్లాడితే మేకిన్ ఇండియా అంటారని, కానీ అదిప్పుడు మేకిన్ చైనాగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు.. ఈ రోజు నుంచి నవంబర్ 16 వరకు మోడీ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ కసిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు పీసీసీ పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని ఆయన తేల్చి చెప్పారు. పీసీసీ పదవి పార్టీకి కట్టుబడి ఉండే విధేయులకు కానీ లేదా సీనియర్లకు కానీ ఇవ్వాలని ఆయన అన్నారు.