
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ రఘు తాతా(Raghuthatha). దర్శకుడు సుమన్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
నీవెందుకు అమ్మాయిలా సరిగ్గా డ్రెస్ వేసుకోలేదని కీర్తిసురేశ్ను అడుగుతుంటే.. సరైన అమ్మాయి కాబట్టే నాకు ఆసక్తి లేదంటోన్న డైలాగ్స్తో ట్రైలర్ మొదలయ్యింది. అలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్ 'మొదట అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకో' అని కీర్తిసురేశ్కు చెప్తుండగా..మరోవైపు రవీంద్ర విజయ్, కీర్తిసురేశ్ లవ్ ట్రాక్తోపాటు కీర్తిసురేశ్ హిందీ నేర్చుకునే సన్నివేశాలతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఒక మహిళ సమాజంలో ఎదుర్కొనే అనేక ఇబ్బందులను ఇందులో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఈ ట్రైలర్ లాంఛ్ సందర్బంగా మేకర్స్ మాట్లాడుతూ.. 'రఘు తాత అనేది కంటెంట్ ఓరియెంటెడ్ గా వస్తున్న సినిమా. అందుకే కథను నమ్ముకొని వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు.'
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరకిందర్ నిర్మించారు. ఈ సినిమాకు శ్యాన్ రోల్డన్ సంగీతం అందించగా, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు.ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.