కేజ్రీవాల్ సింహం.. జైల్లో బంధించ‌లేరు: సునీత

కేజ్రీవాల్ సింహం.. జైల్లో బంధించ‌లేరు: సునీత

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా విప‌క్షాలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం ( మార్చి 31) మెగా ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ త‌న భ‌ర్త అర‌వింద్ కేజ్రీవాల్‌ను మ‌న ప్రధాని మోదీ జైలులో పెట్టార‌ని.. ప్రధాని నిర్ణయం సరైన‌దేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ సింహం లాంటి వాడ‌ని, ఆయ‌న‌ను ఎంతోకాలం కాషాయ పాల‌కులు జైల్లో బంధించ‌లేర‌ని సునీతా కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింహం అని, ఆయనను ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ( మార్చి 31)  ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్ తంత్ర బచావో ర్యాలీని నిర్వహించాయి. అందులో ఆమె పాల్గొని ప్రసంగించారు.  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో నిర్వహించిన లోక్ తంత్ర బచావో  ర్యాలీలో ఆమె ప్రసంగించారు. తన భర్త జైలు నుంచే సందేశం పంపారని సునీతా కేజ్రీవాల్ అన్నారు.

 మన ప్రధాని నరేంద్ర మోదీ నా భర్తను జైల్లో పెట్టారు. ప్రధాని చేసింది కరెక్టేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, నిజాయితీపరుడని మీరు నమ్ముతారా?’’ అని అన్నారు. ‘‘కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఆయన రాజీనామా చేయాలని ఈ బీజేపీ వాళ్లు అంటున్నారు. ఆయన రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం... ఆయనను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు అని ఆమె తెలిపారు.

అనంతరం కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని సునీత ర్యాలీలో చదవి వినిపించారు. ‘‘నేను ఈ రోజు ఓట్లు అడగడం లేదు. 140 కోట్ల మంది భారతీయులను నవభారత నిర్మాణానికి ఆహ్వానిస్తున్నాను. భారతదేశం వేల సంవత్సరాల నాగరికత కలిగిన గొప్ప దేశం. నేను జైలు లోపలి నుండి భరతమాత గురించి ఆలోచిస్తున్నాను. ఆమె బాధలో ఉంది. నవ భారతాన్ని నిర్మిద్దాం. ’’ అని తెలిపారు. 

ఇండియా కూటమికి అవకాశం ఇస్తే నవ భారతాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.  ఆరు హామీలు ఇస్తున్నాను. ..మొదటిది, దేశం మొత్తంలో విద్యుత్ కోతలు ఉండవు. రెండవది, పేద ప్రజలకు ఉచితంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. మూడవది .., మేము ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ లను నిర్మిస్తాము.  నాల్గవది.. ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తాం. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతుంది ఐదవది, రైతులకు పంటలకు సరైన ధర అందిస్తాం. ఆరవది.. 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తాం. ఈ ఆరు హామీలను ఐదేళ్లలో పూర్తి చేస్తాం. ఈ హామీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అన్ని ప్లానింగ్ చేశాను. జైల్లో నా సంకల్పం మరింత బలపడింది, త్వరలోనే బయటకు వస్తాను’’ అని సునీతా కేజ్రీవాల్ తన భర్త సందేశాన్ని చదివి వినిపించారు.

తన భర్తకు భారీ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సునీతా కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియంతృత్వం అంతమవుతుందని ఆమె అన్నారు. ఇదిలావుండగా, ప్రతిపక్షాల ర్యాలీని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. తమ పాత నేరాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ పార్టీలన్నీ రామ్ లీలా మైదానాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.