పాపం అద్దె తక్కువ అని.. పాత భవంతిలో ఉంటున్న కూలీలు.. బిల్డింగ్ నిలువునా కుప్పకూలడంతో..

పాపం అద్దె తక్కువ అని.. పాత భవంతిలో ఉంటున్న కూలీలు.. బిల్డింగ్ నిలువునా కుప్పకూలడంతో..

రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు.. గ్లోబలైజేషన్.. ద్రవ్యోల్బణం.. ఇవేవీ తెలియదు వారికి. వీటి ప్రభావంతోనే ధరలు పెరిగిపోతున్నాయని కూడా అవగాహన లేని ఆ వేతన జీవులు.. చాలీ చాలని జీతంతో ఎక్కడ తక్కువ అద్దెకు దొరికితే అక్కడ రూమ్ లు తీసుకుని బతకుతూ జీవనం సాగిస్తుంటారు. అలా ఒక 40 ఏళ్ల పాత భవనంలో నివసిస్తున్న కూలీలు ఆ భవనం ఒక్కసారిగా కూలిపోయే సరికి ఆ శిథిలాల కింద చనిపోయిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. 

కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడకర లో ఈ ప్రమాదం సంభవించింది. శుక్రవారం (జూన్ 27) ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా భవనం నిలువునా కుప్పకూలడంతో వాళ్ల బతుకులు ఛిద్రమైపోయాయి. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ పాడుబడ్డ భనంలో 17 మంది కూలీలు నివసిస్తున్నారు. అందులో 14 మంది ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరగిందని.. సుమారు రెండున్నర గంటల కష్టపడి వారి మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాల్సిందిగా లేబర్ మినిస్టర్ శివంకుట్టీ ఆదేశించారు. 

శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులలో ఇద్దరిని వెంటనే బయటికి తీయగలిగామని.. కానీ మూడో వ్యక్తిని తీసేందుకు చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారు. అయితే మొదటి ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారని, మూడో వ్యక్తి శిథిలాల కింది ప్రాణం ఆగిపోయినట్లు తెలిపారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలో ఉండేందుకు ఎందుకు అనుమతించారో.. బిల్డింగ్ ఫిట్ నెస్ ఉందా లేదా అనే దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.