కొత్త ప్రొడక్ట్, గాడ్జెట్, ఫోన్ మార్కెట్లోకి వస్తోందంటే... ఎప్పుడెప్పుడు కొందామా? అని ఎదురుచూస్తారు చాలామంది. అదే ఐఫోన్ కొత్త సిరీస్ అనుకోండి.. అందరికంటే ముందు కొనేయాలి అనుకుంటారు కొందరు. అందుకని మొబైల్ స్టోర్ల ముందు గంటలకొద్దీ ‘క్యూ’ లో నిలబడతారు. కానీ, ఇతను మాత్రం డిఫరెంట్. ఐ ఫోన్ కొనాలంటే దుబాయి ఫ్లయిట్ ఎక్కుతాడు. ఈమధ్యే దుబాయికి వెళ్లి ఐఫోన్ 14 ప్రో తెచ్చుకున్నాడు. ‘ఫోన్ కోసం దుబాయికి వెళ్లడమేంటి!’ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇతని గురించి చదవండి.
కొచ్చికి చెందిన ఇతని పేరు ధీరజ్ పల్లియల్. సొంతంగా బిజినెస్ ఉంది. ఐ ఫోన్ అంటే మస్త్ ఇష్టం. కొత్త సిరీస్ రావడమే ఆలస్యం వెంటనే కొంటాడు. అలాగని కేరళ లేదా బెంగళూరుకి ఫోన్స్ వచ్చే వరకు ఆగడు. ఎందుకంటే.. మనదేశంలో కంటే కొన్ని రోజులు ముందుగానే దుబాయిలో ఐఫోన్లు దొరుకుతాయి. అంతేకాదు మనదగ్గరితో పోల్చితే అక్కడ ధర కూడా తక్కువ. అందుకే ఈమధ్యే ఐఫోన్ 14 ప్రో కొనేందుకు దుబాయి వెళ్లాడు. ఐఫోన్ 8 కొనేందుకు 2017లో మొదటిసారి వెళ్లాడు ధీరజ్. ఐ ఫోన్ల కోసం ఇప్పటివరకు 4 సార్లు దుబాయి వెళ్లాడు. ‘‘మనదేశంలో ఐఫోన్ కొత్త సిరీస్ కొన్న మొదటి వ్యక్తి నేనే కావాలనేది నా కోరిక. అందుకే ఐ ఫోన్ కొనేందుకు దుబాయికి వెళ్తా. మనదేశంలో ఐఫోన్14 ప్రో ధర రూ. 1,59,000. కానీ, దుబాయిలో రూ.1,29,000 కే వస్తుంది. కాకపోతే వీసా, రానుపోను ఫ్లయిట్ టికెట్స్కి రూ. 40 వేలు, ఇతర ఖర్చులు కలిపి రూ. 1,69,000 అయింది. మనదేశంలో 14 ప్రో ధర కంటే పది వేల రూపాయలు ఎక్కువ ఖర్చయ్యాయి” అని చెప్పాడు ధీరజ్. ఇతని గురించి విన్నవాళ్లంతా ‘ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా!’ అని ఆశ్చర్యపోతున్నారు.