
- మరో నిందితుడు రవికుమార్ కూడా..
- హైదరాబాద్ హైదర్షాకోట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మూడు కార్లు, 10 కోట్ల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఫాల్కన్ గ్రూప్ చైర్మన్, ఎండీ అమర్దీప్ సోదరుడు ఫాల్కన్ కంపెనీ ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్, మరో నిందితుడు రవికుమార్ను మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2.5 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు, రూ.10 కోట్ల విలువైన14 ఆస్తుల డాక్యుమెంట్లను, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ వివరాలను సీఐడీ చీఫ్ శిఖాగోయల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సైబరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ను తయారు చేసింది. తమ కంపెనీ ద్వారా ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయించారు.
ఇలా 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేశారు. ఈ మోసాలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. 4,065 బాధితుల నుంచి సంస్థ రూ.792 కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది. దీనిపై ఫిబ్రవరి 15న సైబరాబాద్ ఎకామిక్ అఫెన్సెస్ వింగ్(ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా మార్చి నుంచి సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది.
నేపాల్ మీదుగా ఇండియాలోకి
సైబరాబాద్లో కేసు నమోదైన వెంటనే ఫాల్కన్ ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్ కుటుంబంతో సహా దుబాయ్కి పారిపోయాడు. ఆ తరువాత నేపాల్ మీదుగా అక్రమంగా పాట్నాకు మాకాం మార్చాడు. సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు పాట్నాకు వెళ్లి గాలించారు. విషయం తెలుసుకున్న సందీప్ కుమార్ అక్కడి నుంచి కూడా పారిపోయాడు. దీంతో సందీప్ కుమార్ భార్య, తండ్రిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
వీరిద్దని విచారించారు. సందీప్ కుమార్ సీఐడీ నుంచి తప్పించుకుంటూ బీహార్ నుంచి ఒడిషా అక్కడి నుంచి గోవాకు వెళ్లాడు. ఈ క్రమంలో పోలీసుల నిఘా తగ్గిందని భావించి హైదరాబాద్ హైదర్షాకోట్లో నివాసం ఉంటున్న అతడి వరుసకు సోదరుడు, ఈ కేసులో నిందితుడైన రవికుమార్ వద్దకు చేరాడు. సమాచారం తెలుసుకున్న సీఐడీ ఎకానమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ వెంటకలక్ష్మీ నేతృత్వంలో డీఎస్పీ అశోక్ కుమార్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది.