హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం చలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావ రవి వెల్లడించారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెంటనే బేసిక్ పే ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీల్లో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా ఏటా రూ.వెయ్యి వార్షిక పెంపు, రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా సెలవులు మంజూరు చేయాలన్నారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలిచ్చామని..అయినా ఫలితం లేకపోవడంతోనే చలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.