తెలంగాణలో ఓవర్లోడ్ సరుకు , ఖనిజ వాహనాలపై రవాణా శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. క్వారీలు, కంపెనీలు, లోడింగ్ స్థావరాల్లో అనుమతికి మించి లోడింగ్ జరుగుతున్నట్లు ప్రత్యేక తనిఖీల్లో గుర్తించిన అధికారులు.. ఈ రవాణాపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు లోడింగ్ పాయింట్ల ఇంచార్జులు, జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు వెళ్లాయి.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో పేర్కొన్న జీవీడబ్ల్యూ (GVW - గ్రాస్ వెహికల్ వెయిట్) దాటేలా వాహనాల్లో లోడింగ్ చేయరాదని రవాణా శాఖ స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 113 ప్రకారం.. నిర్దేశిత బరువు కంటే ఎక్కువ లోడ్తో వాహనం నడపడం నేరమని గుర్తు చేసింది.
అధిక లోడు ఉన్న వాహనాలకు వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేయడం చట్ట విరుద్ధమని రవాణా శాఖ తేల్చి చెప్పింది. ఇది మోటారు వాహనాల చట్టం–1988తో పాటు మైనింగ్ నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించే ఓవర్లోడ్ వాహనాలకు సెక్షన్ 194 కింద శిక్షలు, సెక్షన్ 199 కింద బాధ్యత వర్తిస్తుందని.. ఉల్లంఘించిన యజమానులు, బాధ్యులపై నేరుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అనుమతించిన పరిమితికి మించిన ఖనిజాలకు ఎలాంటి రాయల్టీ, ట్రాన్సిట్ రసీదులు జారీ చేయవద్దని మైనింగ్ అధికారులను రవాణా శాఖ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలను అన్ని కంపెనీలు, క్వారీలు, లోడింగ్ స్థావరాలకు అందజేసి, వారి నుంచి వ్రాతపూర్వక అంగీకారం తీసుకోవాలని జిల్లా రవాణా అధికారులకు సూచించింది. దీనికి సంబంధించిన అమలు నివేదికను వెంటనే రవాణా కమిషనర్ కార్యాలయానికి పంపాలని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.
