- ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సమయం కోరుతూ స్పీకర్కు దానం లేఖ
హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం స్పందించారు.
స్పీకర్ ఇచ్చిన గడువుకు ఆదివారం చివరి రోజు కావడంతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ కార్యాలయానికి దానం లేఖ పంపించినట్లు తెలిసింది. మొత్తం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ పూర్తి కాగా, ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మొదటిసారి నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో స్పీకర్ ఈ ఇద్దరికి రెండోసారి నోటీసులు జారీ చేశారు.
దీంతో మూడ్రోజుల కింద కడియం స్పీకర్ను కలిసి సమయం కోరగా, దానం మాత్రం ఆదివారం స్పీకర్కు లేఖ రాశారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు తనకు మరింత గడువు ఇవ్వాలని ఆ లేఖలో స్పీకర్కు దానం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
